Odisha Lok Sabha Elections 2024 :ఒడిశా లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలన్నీ వ్యూహ రచనలో మునిగిపోయాయి. అభివృద్ధే నినాదంగా అధికార బిజూ జనతా దళ్, అవినీతి, నిరుద్యోగమే నినాదంగా ప్రతిపక్షాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పొత్తు పొడవకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ కూడా ప్రచార జోరు పెంచింది. సంస్థాగతంగా ఇంకా పటిష్టంగానే కనిపిస్తున్న కాంగ్రెస్ కూడా ఈసారి సత్తా చాటి పూర్వ వైభవాన్ని చాటాలని సిద్ధంగా ఉంది.
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతా దళ్ రెండు దశాబ్దాలకుపైగా ఒడిశాలో బలమైన కోటను నిర్మించుకుంది. ఈ కోటను బద్దలు కొట్టి అధికారాన్ని కైవసం చేసుకోవడం ప్రతిపక్షాలకు కష్టమైన పనే. గతంలో బిజూ జనతా దళ్కు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగా బరిలో నిలిచింది. మూడోస్థానంలో ఉన్న కాంగ్రెస్ నుంచి కూడా సీఎం నవీన్ పట్నాయక్కు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒడిశాలో 21 లోక్సభ స్థానాలు, 147 శాసనసభ స్థానాలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13, 20, 25, జూన్ 1 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
ఎన్నికల్లో ప్రధాన పాత్ర వీటిదే
నిరుద్యోగం, అవినీతి, శాంతిభద్రతలు, వరి సేకరణలో అక్రమాలు, చిట్ ఫండ్, మైనింగ్ స్కామ్ వంటివి ఒడిశా ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని అధికార బిజూ జనతాదళ్ ఇప్పటికే 24 ఏళ్లుగా అధికారంలో ఉంది. గత ఐదేళ్లలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని పార్టీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఒడిశాకు మోదీ సర్కార్ నుంచి మద్దతు లభిస్తోందని అందుకే కేంద్రానికి అండగా నిలుస్తున్నామని బిజు జనతా దళ్ పార్టీ పార్లమెంటు వేదికగా ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని విమర్శించే ప్రధాన అస్త్రాన్ని నవీన్ పట్నాయక్ పార్టీ కోల్పోయింది. ఒడిశాలో పరిపాలన అంతా ఒడిశా యేతర అధికారులే నడిపిస్తున్నారన్న ఆరోపణ నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై ఉంది. నవీన్ పట్నాయక్ ఎక్కువగా ఒడియా యేతర అధికారులపై ఆధారపడటాన్ని అస్త్రంగా చేసుకుని ఎన్నికలకు వెళతామని ప్రతిపక్ష బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.
అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టే అంశాలివే
24 ఏళ్ల పాలనలో నిరుద్యోగం, వలసలు పెరగడం అధికార బిజు జనతా దళ్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. నవీన్ పట్నాయక్ 24 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించినా ఒడిశా నుంచి యువకుల వలసలను అరికట్టడంలో విఫలమయ్యారని బీజేపీ ఆరోపిస్తోంది. ఉద్యోగాల కల్పనలోనూ ప్రభుత్వం విఫలమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా జరిగిన రిక్రూట్మెంట్ స్కామ్ ఆరోపణలు కూడా నవీన్ ప్రభుత్వాన్ని చుట్టు ముట్టాయి. ఒడిశాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పటికీ మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు ఈ రెండు సమస్యలను ప్రధానంగా ప్రజల వద్దకు చేర్చేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒడిశాలో ఈసారి ఎన్నికల్లో వివక్ష, అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివిధ పథకాల అమలులో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన సహా పలు పథకాలకు లబ్ధిదారులను రాజకీయ ప్రాతిపదికన ఎంపిక చేశారని నవీన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నవీన్ ప్రభుత్వం వివిధ పనుల్లో ఒడియాయేతర కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా కాంగ్రెస్ ప్రశ్నలు సంధిస్తోంది. చిట్ఫండ్, మైనింగ్ కుంభకోణం కూడా నవీన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. చిట్ఫండ్ స్కామ్పై ప్రతిపక్షాలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి. చిట్ఫండ్ కుంభకోణం, మైనింగ్ అక్రమాలు రెండింటిలోనూ అధికార పార్టీ సభ్యుల హస్తం ఉందని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపించాయి. ఈ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఈ పార్టీలు డిమాండ్ చేశాయి.
నవీన్ పట్నాయక్కు ఎదురయ్యే సవాళ్లివే
నవీన్ పట్నాయక్ ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ ధాన్యం సేకరణలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ధాన్యం సేకరణలో అక్రమాలను అరికట్టడంలో బిజూ జనతా దళ్ ప్రభుత్వం విఫలమైందని రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ ఆధీనంలోని మండీల్లో అవకతవకల కారణంగా కొన్నిసార్లు రైతులు మోసపోతున్నారని మండిపడుతున్నారు. వేసవిలో పోలింగ్ జరుగుతుండడం వల్ల ఎన్నికల ప్రచారంలో తాగునీటి సమస్య ప్రధానం అంశం కానుంది. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికీ ప్రజలందరికీ తాగునీరు అందించలేకపోయింది. రాయగడ, గజపతి సహా కొన్ని ప్రాంతాల్లో గిరిజన ప్రాబల్యం ఉన్న జిల్లాలలో అతిసారం, ఇతర నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలడం నవీన్ సర్కార్కు తలనొప్పులు తెచ్చి పెడుతోంది.