ETV Bharat / opinion

రాయ్​బరేలీలో రాహుల్ 'సై'- అమేఠీలో స్మృతి ఇరానీ- ఐదో విడతలో పోటీ చేసే ప్రముఖులు వీరే! - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 10:53 AM IST

Key Candidates In 5th phase Election : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ అగ్ర నాయకులు రాజ్​నాథ్ సింగ్, పీయూశ్ గోయల్, స్మృతి ఇరానీ సహా పలువురు నేతలు లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్​లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మే 20న దేశవ్యాప్తంగా ఉన్న 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

key candidates in 5th phase Election
key candidates in 5th phase Election (ANI)

Key Candidates In 5th phase Election: ఐదోదశ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ అగ్రనాయకులు రాజ్​నాథ్​ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీయూశ్ గోయల్, ఎల్​జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ సహా పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాయ్​బరేలీ నుంచి రాహుల్ బరిలో దిగగా, లఖ్​నవూ స్థానంలో రాజ్​నాథ్ సింగ్, అమేఠీ నుంచి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. కాగా, మే 20న దేశవ్యాప్తంగా ఉన్న 49 స్థానాలకు ఐదో దశలో పోలింగ్ జరగనుంది.

రాయ్​బరేలీలో హోరాహోరీ తప్పదా?
ఉత్తర్​ప్రదేశ్​లోని రాయ్​బరేలీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. 2019 వరకు కాంగ్రెస్​కు కంచుకోటగా ఉన్న రాయ్​బరేలీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి దినేశ్ సింగ్ బరిలో ఉన్నారు. ఆయన కూడా బలమైన నేత. ఈ నేపథ్యంలో రాహుల్​కు రాయ్​బరేలీలో విజయం నల్లేరు మీద నడక కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్​కు దినేశ్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, కేరళలోని వయనాడ్​లో పోటీ చేసిన రాహుల్​కు రాయ్​బరేలీలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. దశాబ్దాలుగా హస్తం పార్టీకి కంచుకోటగా ఉన్న రాయ్​బరేలీలో రాహుల్ విజయంపై ఆసక్తి నెలకొంది. కాగా, రాహుల్ గాంధీ 2004-2019 వరకు అమేఠీ నుంచి ప్రాతినిధ్యం వహించారు.

హ్యాట్రిక్​పై రాజ్​నాథ్ ధీమా
ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూ నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ అగ్రనేత, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆశపడుతున్నారు. రాజ్​నాథ్ సింగ్​పై సమాజ్​వాదీ పార్టీ రవిదాస్ మెహ్రోత్రాను నిలబెట్టింది. 2019లో ఆరు లక్షల పైగా మెజారిటీతో గెలిచిన రాజ్​నాథ్ అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని భావిస్తున్నారు.

స్మృతి మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?
2019లో అమేఠీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించిన బీజేపీ మహిళ నేత స్మృతి ఇరానీ మరోసారి అదే స్థానం నుంచి బరిలో దిగారు. కాంగ్రెస్ పార్టీ కిశోరీ లాల్​ను స్మృతిపై పోటీకి దింపింది. ఈ నేపథ్యంలో అమేఠీలో పోరు ఆసక్తికరంగా మారింది.

అదృష్టాన్ని పరీక్షించుకోనున్న పీయూశ్
ముంబయి నార్త్‌ స్థానం నుంచి బీజేపీ తరఫున కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ భూషణ్‌ పాటిల్‌ను బరిలో ఉంచింది. ముంబయి నార్త్ నియోజకవర్గంలో తప్పకుండా విజయం సాధిస్తానని పీయూశ్ గోయల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పీయూశ్, భూషణ్‌ పాటిల్‌ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ముంబయి పేలుళ్ల కేసు న్యాయవాదికి టికెట్
ముంబయి నార్త్‌ సెంట్రల్‌ స్థానం నుంచి ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ను బీజేపీ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించింది. కాంగ్రెస్ నుంచి వర్షా గైక్వాడ్‌ పోటీ చేస్తున్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్‌ ఎంపీ పూనమ్‌ మహాజన్‌ను ఈసారి పక్కనపెట్టి ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌కు బీజేపీ అవకాశం ఇచ్చింది. 2008 ముంబయి దాడి కేసు సహా పలు ప్రముఖ కేసులను ఉజ్వల్ నికమ్ వాదించి మంచి పేరు సంపాదించుకున్నారు.

తండ్రిపై ఆరోపణలు- కొడుకుకు టికెట్
కైసర్‌ గంజ్ లోక్‌సభ స్థానం నుంచి రెజ్లర్ల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు టికెట్ నిరాకరించి ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌ను బరిలో దింపింది కమలం పార్టీ. కరణ్​పై ఎస్​పీ రామ్ భగత్ మిశ్రాను పోటీకి దింపింది. ఈ ప్రాంతంలో బ్రిజ్ భూషణ్ కుటుంబానికి మంచి పట్టు ఉండడం వల్ల ఈ సారి కూడా బీజేపీ కైసర్ గంజ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

హాజీపుర్ నుంచి బరిలో చిరాగ్ పాసవాన్
ఎన్​డీఏ భాగస్వామ్య పార్టీ అయిన ఎల్​జేపీ(రామ్ విలాస్) నుంచి చిరాగ్ పాసవాన్ పోటీ చేస్తున్నారు. ఆయనపై శివ చంద్రరామ్‌ను పోటీకి దింపింది ఆర్జేడీ. తన సిట్టింగ్ నియోజకవర్గమైన జముయి నుంచి చిరాగ్ హాజీపుర్​కు మారారు. తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాసవాన్ పోటీ చేసిన హాజీపుర్​లో విజయం సాధించాలని ఆశపడుతున్నారు.

లాలూ కుమార్తెతో ఢీ
బిహార్​లోని సారణ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అగ్రనేత రాజీవ్ ప్రతాప్ రూడీ బరిలో ఉన్నారు. ఆయనపై బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య ఆర్​జేడీ తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో సారణ్​లో హోరాహోరీ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకుల మాట.

బారాముల్లా నుంచి ఒమర్ అబ్దుల్లా
నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బారాముల్లా నుంచి బరిలో దిగుతున్నారు. ఇక ఐదో దశలోక్‌సభ ఎన్నికలు మే 20న జరుగనుంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

కాంగ్రెస్ కంచుకోటలో బీజేపీ గెలుస్తుందా? రాయ్​బరేలీ, అమేఠీలో ప్రియాంక గాంధీ వ్యూహాలు పని చేస్తాయా? - Lok Sabha Elections 2024

గల్లీ టు దిల్లీ వయా 'యూపీ'- అక్కడ కొడితే కుంభస్థలం బద్దలుగొట్టినట్లే! - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.