ETV Bharat / Parliament Elections 2024
Parliament Elections 2024
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో 66.30 ఓటింగ్ శాతం నమోదయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తుది పోలింగ్ శాతాన్ని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో సోమవారం ఒకటి, రెండు ఘటనలు తప్పా ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వచ్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పరిధిలో ఉన్న 5 ఎంపీ నియోజకవర్గాల్లో 13 అసెంబ్లీ సెగ్మంట్లలలో సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. మిగలిని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలతో ముగిసినా, అప్పటికే క్యూలైన్లో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ప్రజలు చైతన్యవంతంగా కదిలి ముందుకు రావడంతో గత లోక్సభ ఎన్నికల కంటే 3 శాతం ఎక్కువగా నమోదయిందని సీఈవో వికాస్రాజ్ తెలిపారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో 66.30 ఓటింగ్ శాతం నమోదయింది. అత్యధికంగా భువనగిరిలో 76.78 శాతం పోలింగ్ నమోదు అవ్వగా, అత్యల్పంగా హైదరాబాద్లో 48.48 శాతం పోలింగ్ నమోదయింది. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంటులో అత్యధికంగా 84.25 శాతం నమోదయిందని పేర్కొన్నారు. మలక్పేట అసెంబ్లీ సెగ్మెంట్లో అతి తక్కువగా 42.76 శాతం నమోదయిందని వెల్లడించారు. జూన్ 4న 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.