టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీల వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. తాజాగా విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో గంగూలీని అన్ఫాలో చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. శనివారం గంగూలీ చేసిన దానికి.. కోహ్లీ ప్రతీకార చర్యగా ఇలా చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజా ఇన్స్టాగ్రామ్ పరిణామంతో అభిమానుల సందేహాలు మరింత బలపడ్డాయి. ఏదేమైనా వీరిద్దరి మధ్య గొడవ.. క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉందని పలువురు క్రీడా విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అయిపోయాక ఇరు జట్లు కరచాలనం చేసుకునేందుకు మైదనంలోకి వచ్చాయి. ఈ క్రమంలో రెండు టీమ్స్ షేక్ హ్యాండ్స్ ఇస్తున్న సమయంలో విరాట్- సౌరభ్ ఇద్దరూ దూరంగా వెళ్లిపోయారు. గంగూలీ దగ్గరికి వచ్చిన సమయంలో కోహ్లీ.. దిల్లీ కోచ్ పాంటింగ్తో వైపు చూస్తూ మాట్లాడాడు. గంగూలీ కోహ్లీని దాటి ముందుకు వెళ్లి వేరే ఆటగాడితో కరచాలనం చేశాడు. అయితే వారిద్దరూ కావాలనే ఇలా చేశారా అన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో వారిద్దరి మధ్య ఇంకా కోల్డ్ వార్ నడుస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు.
మ్యాచ్ మధ్యలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఫీల్డింగ్ చేస్తుండగా విరాట్ కోహ్లీ.. దాదావైపు కోపంగా ఓ లుక్ ఇచ్చాడని అభిమానులు ఓ ఫొటోను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాదా పట్ల విరాట్ ప్రవర్తించిన తీరును కొందరు విమర్శిస్తుంటే.. కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.