తెలంగాణ

telangana

Nagaland Army killings: అమిత్ షా వివరణ అసంబద్ధం.. పరిహారం అమానవీయం!

By

Published : Dec 8, 2021, 6:47 AM IST

Nagaland Army killings: నాగాలాండ్​లో భద్రతా బలగాల దుశ్చర్యను సమర్థించే విధంగా పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అధికారిక స్పందన నూటికి నూరుశాతం అసంబద్ధంగా ఉంది. ఆత్మరక్షణ కోసమే భద్రతా బలగాలు కాల్పులకు తెగబడ్డాయన్న అమాత్యుల వివరణ నివ్వెరపరుస్తోంది. నిర్లక్ష్యంగా పౌరుల ప్రాణాలు తీశాక.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కంటితుడుపు చర్యలాగే ఉంది.

nagaland army killings
nagaland army killings

Nagaland Army killings: పుండుమీద గొడ్డుకారం జల్లడమంటే ఇదే. తీవ్రవాదులని పొరబడి సాధారణ పౌరుల్ని కాల్చేసిన భద్రతా బలగాల దుశ్చర్యను సమర్థిస్తున్న విధంగా పార్లమెంటులో కేంద్ర హోంశాఖామాత్యుల అధికారిక స్పందన- నూటికి నూరుశాతం అసంబద్ధమే. నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో ఇంటికి తిరిగివెళ్తున్న ఆరుగురు గనికార్మికులపై భద్రతా బలగాలు కాల్పులకు తెగబడిన ఘటన, యావద్దేశాన్నీ నిర్ఘాంతపరచింది. ప్రజ్వరిల్లిన నిరసనల్ని అణచివేసే పేరిట మళ్ళీ తుపాకుల మోత, ఇంకో ఎనమండుగురి ప్రాణాలు తోడేసింది. అస్సాం రైఫిల్స్‌ శిబిరానికి, భద్రతాబలగాల వాహనాలకు నిప్పుపెట్టే స్థాయిలో ప్రజానీకం గుండెలు భగ్గుమన్నాయి.

Amit shah on Nagaland civilian killings

మయన్మార్‌ సరిహద్దు వెంబడి ఏకే47 రైఫిళ్లు, మరతుపాకులు, గ్రెనేడ్లు తదితరాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి నియుక్తమైన బలగాలు- తమకందిన అరకొర సమాచారాన్ని నిర్ధారించుకోకుండానే, రోజుకూలీతో పొట్టపోసుకునే అభాగ్యులపై కర్కశ దాడికి తెగబడినట్లు క్షేత్రస్థాయి కథనాలు చాటుతున్నాయి. ఘోరమైన తప్పిదం చోటుచేసుకుందని గ్రహించిన సైన్యం- బలగాల అకృత్యాన్ని ఖండించింది. బాధ్యులపై చర్యలు తప్పవంటూ కోర్ట్‌ మార్షల్‌కు ఆదేశించింది. తనవంతుగా దురదృష్టకర ఘటనకు చింతించి, సంతాపం వ్యక్తపరచిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా భిన్నగళం వినిపించారు. ఆత్మరక్షణ కోసమే భద్రతా బలగాలు కాల్పులకు తెగబడ్డాయన్న అమాత్యుల వివరణ నివ్వెరపరుస్తోంది. ఒక్కో బాధిత కుటుంబానికీ నాగాలాండ్‌ ప్రభుత్వం ప్రకటించిన అయిదు లక్షల రూపాయల నష్టపరిహారం ఏ మూలకు? అన్ని ప్రాణాల్ని సైన్యం నిర్లక్ష్యంగా కబళించాక కంటితుడుపు పరిహారం విదపడం... ఏం మానవత్వం? ఈ యావత్‌ ప్రహసనం, అక్కడి శాంతి చర్చలకు తీవ్ర విఘాతం అనివార్యమన్న విశ్లేషణలకు తావిచ్చింది. నాగా తిరుగుబాటుదారులతో కేంద్రం చిరకాలంగా జరుపుతున్న శాంతి చర్చలు పట్టాలు తప్పే ముప్పు ఉరుముతోంది. సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్లూ బలం పుంజుకొంటున్నాయి. ప్రధాన జనజీవన స్రవంతికి, నాగాలకు మధ్య అంతరాన్ని విస్తరింపజేసే దౌర్భాగ్య పరిణామ క్రమమిది!

ఏడేళ్ల క్రితం కశ్మీర్‌లోని బుద్గామ్‌ జిల్లా ఛత్తర్‌గ్రామ్‌లో రోడ్డున పోతున్న ఓ కారుమీద రాష్ట్రీయ రైఫిల్స్‌ జవాన్లు 'పొరపాటున' జరిపిన కాల్పుల్లో ఇద్దరు పిల్లలు మరణించారు. అది తమ తప్పిదమేనని ఉత్తర ప్రాంత సైనిక కమాండర్‌ అంగీకరించడం అప్పట్లో దేశవాసుల్ని విస్మయానికి లోనుచేసింది. ఇప్పటికి సుమారు రెండు దశాబ్దాల క్రితం ఉత్తర్‌ కశ్మీర్‌లోని మచిల్‌ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తుల్ని 'నకిలీ ఎదురు కాల్పుల' పేరిట కడతేర్చిన ఇద్దరు అధికారులకు సైనిక న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. అటువంటివి అరుదైన ఉదాహరణలే.

AFSPA Nagaland

పౌరుల ప్రాణాల్ని తృణప్రాయంగా కబళించి నిష్పూచీగా వ్యవహరించే వెసులుబాటును సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (అఫ్సా) కల్పిస్తోంది. 1958లో నాగా వేర్పాటువాదంపై ఉక్కుపాదం మోపడానికి నెహ్రూ జమానా ప్రయోగించిన ఆ కర్కశ శాసనాన్ని అనంతర కాలంలో కశ్మీరానికి, కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు వర్తింపజేశారు. కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన చోట్ల భద్రతాబలగాలు మహిళలపై అత్యాచారాలకు, అమాయకుల హత్యలకు ఒడిగట్టినా- కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేనిదే నిందితుల విచారణ సాధ్యం కాదని ఆ చట్టంలోని ఆరో విభాగం చాటుతోంది. 'ఉక్కు మహిళ' ఇరోమ్‌ షర్మిల దాదాపు పదహారేళ్లపాటు నిరాహార దీక్ష కొనసాగించింది- అహేతుక నిబంధనలతో కూడిన చట్టాన్ని మణిపుర్‌లో రద్దు చేయాలన్న డిమాండుతోనే.

వివాదాస్పద శాసనానికి మంగళం పలకాల్సిందేనని తాజాగా నాగాలాండ్‌, మేఘాలయ ముఖ్యమంత్రులు గళమెత్తారు. ఆ చట్టాన్ని అటకెక్కించాలని జస్టిస్‌ జీవన్‌రెడ్డి కమిటీ, జస్టిస్‌ జేఎస్‌ వర్మ కమిషన్‌ ఏనాడో సిఫార్సు చేశాయి. 'అఫ్సా'ను కార్యాచరణలో మానవీయంగా తీర్చిదిద్దడానికి గతంలోనే సుముఖత చాటిన మోదీ ప్రభుత్వం, అమానుష ఘటనలకు బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టేలా చూడాలి. నాగాలాండ్‌తోపాటు యావత్‌ దేశానికి నిరంకుశ చట్టం పీడను శాశ్వతంగా విరగడ చేయడానికి ఇకనైనా ముందడుగు వేయాలి!

ABOUT THE AUTHOR

...view details