తెలంగాణ

telangana

ఉల్లి ఘాటు తగ్గుతుంటే.. వంటనూనె సెగ పెరుగుతోంది

By

Published : Jan 12, 2020, 9:14 AM IST

Updated : Jan 12, 2020, 9:37 AM IST

ఉల్లి ఘాటు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నప్పటికీ.. వంట నూనెల ధరలు పెరిగిపోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గడిచిన నెల రోజుల్లో 15 శాతం వరకు వంటనూనెల ధరలు పెరిగాయి.

Edible oil
వంటనూనే మంట పెరుగుతోంది

దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలు పెరుగుతున్నాయి. గత నెలరోజుల్లో దేశంలో ముడి పామాయిల్‌ ధరలు ఇంచుమించు 15 శాతం వరకు పెరిగాయి. డిసెంబర్‌ 10 నాటికి పది కేజీల ముడి పామాయిల్‌ ధర దేశంలో రూ.731.40 ఉండగా జనవరిలో ఈ ధర రూ.839.80గా ఉంది. నిదానంగా పెరుగుతున్న పామాయిల్‌ ధరకు వంతపాడుతూ ఇతర వంటనూనెల ధరలూ పెరుగుతున్నాయి.

పెరుగుదల ఇలా..

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ ప్రకారం.. దిల్లీలో ఆవనూనె ధర ఒక నెలలో కేజీకి రూ.12 పెరిగింది. ఇక్కడ పామాయిల్‌ ధర రూ.91 నుంచి రూ. 105కి, సోయాబీన్‌ నూనె ధర రూ.106 నుంచి రూ.122కు ఎగబాకాయి. దేశవ్యాప్తంగా ఈ విధమైన పరిస్థితే ఉన్నట్టు తెలుస్తోంది.

శుక్రవారం నాటికి మలేషియాలో రిఫైన్డ్‌ పామాయిల్‌ ధర టన్ను 800 డాలర్లుగా ఉంది. కాగా డిసెంబర్‌లో ఈ ధర కేవలం 710 డాలర్లు మాత్రమే. దీంతో భారత ప్రభుత్వం మలేషియా నుంచి రిఫైన్డ్‌ పామాయిల్ దిగుమతులపై ఆంక్షలు విధించింది. మలేషియా రిఫైన్డ్‌ పామాయిల్‌ను నిషేధిత జాబితాలోకి చేర్చింది. అయితే ఈ దేశం నుంచి ముడి పామాయిల్‌ దిగుమతులకు ఈ నిషేధం వర్తించదు.

ప్రపంచ వ్యాప్తంగా అదే తీరు..

వంటనూనెల ధర భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే దేశంలో నిల్వలు తక్కువగా ఉన్నందువల్ల ధరల పెరుగుదల నుంచి త్వరితంగా ఊరట లభిస్తుందని ఆశించలేమని అభిప్రాయపడుతున్నారు. భారత్‌ ముఖ్యంగా దిగుమతుల పైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో వంటనూనె ధరలు తగ్గాలంటే దేశీయ నూనె గింజల ఉత్పత్తిని పెంచటం ఒకటే ప్రత్యామ్నాయమని వారు సూచించారు.

ఇదీ చూడండి:'చమురు ధరల పెరుగుదలపై ఆందోళన అవసరం లేదు'

Last Updated :Jan 12, 2020, 9:37 AM IST

ABOUT THE AUTHOR

...view details