Elon Musk India Visit : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా పడింది. వాస్తవంగా ఆదివారం ఆయన మనదేశానికి రావాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కావాల్సి ఉంది. అయితే టెస్లాకు సంబంధించిన అతి ముఖ్యమైన బాధ్యతల కారణంగా తన పర్యటన ఆలస్యమవుతోందని ఎక్స్ వేదికగా మస్క్ వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో భారత్లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
అయితే ఆయన ఈ నెల 21, 22 తేదీల్లో భారత్లో పర్యటించాల్సి ఉంది. ఈ రెండు రోజుల ప్రణాళికలో ప్రధాని మోదీ-మస్క్ కీలక భేటీ కూడా ఒకటి. అనంతరం వారు పెట్టుబడుల గురించి ప్రకటన చేస్తారని అంతా భావించారు.
'తయారీలో భారత ప్రజల స్వేదం ఉండాలి'
ఈ ఏడాదిలో భారత పర్యటన, ప్రధాని మోదీ భేటీని ధ్రువీకరిస్తూ కొద్దిరోజుల క్రితం ఎలాన్ మస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇటీవల దీని గురించి ప్రధాని మోదీని అడగ్గా, భారత్కు పెట్టుబడులు రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇక్కడ ఎవరు పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదని, కానీ తయారీరంగంలో భారత ప్రజల స్వేదం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. 'మన మాతృభూమి ప్రత్యేకత ఉండాలి. అప్పుడే మన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి" అని మోదీ పేర్కొన్నారు.