ETV Bharat / state

Crop Damage in Mahabubnagar : వానలు లేక ఎండిపోతున్న పంట.. మళ్లీ రైతన్నకు తప్పని ఇబ్బందులు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2023, 2:47 PM IST

Crop Damage in Mahabubngar : సీజన్ ప్రారంభంలో వానలే లేవు. ఆ తర్వాత జూలై మాసంలో రాష్ట్రమంతటా వానలు దంచి కొట్టాయి. మళ్లీ ఆగస్టు నుంచి చినుకు జాడే లేకుండా పోయింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వేసిన వర్షాధారిత పంటలు ప్రస్తుతం ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. తొలత వానల్లేక, ఆ తర్వాత అధిక వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులు..తాజా వర్షాభావ పరిస్థితుల్లో పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మొక్కజొన్న రైతులు పంటపై ఆశలు వదిలేసుకుంటున్నారు. మిగిలిన వర్షాధార పంటల పరిస్థితి దాదాపుగా అలాగే ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొద్దిరోజులుగా వర్షాలు లేక ఎండిపోతున్న పంటలపై ఈటీవీ భారత్ కథనం.

Crop Damage
Crop Damage in Mahabubngar

వానలు లేక ఎండిపోతున్న పంట.. మళ్లీ రైతన్నకు తప్పని ఇబ్బందులు

Crop Damage in Mahabubngar : ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో గత 20రోజుల నుంచి వానలు కురవక (No Rains in Telangana) వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఎదురవుతోంది. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సాధారణ సాగువిస్తీర్ణం 18లక్షల46వేల ఎకరాలు కాగా, ప్రస్తుతం 11లక్షల 70వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా 7లక్షల ఎకరాల్లో పత్తిసాగైంది. ప్రస్తుతం పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సీజన్ ప్రారంభంలో వానలు కురుస్తాయని విత్తనాలు వేసిన రైతులకు నిరాశే ఎదురైంది. వానల్లేక వేసిన విత్తులు తీసేసి మళ్లీ మళ్లీ వేయాల్సి వచ్చింది. అలా ఒక్కో రైతు 2నుంచి 3సార్లు విత్తనాలు నాటారు. ఆ తర్వాత జూలై రెండో వారం నుంచి నెలాఖరు వరకూ వానలు దంచికొట్టాయి.

ఆ వానలు ఎండిపోతాయి అనుకున్నా పంటలకు వూతమిచ్చాయి. కాని గడిచిన 20రోజుల నుంచి వానల్లేక అవే పంటలు ఎండిపోతున్నాయి. మొక్క వాడిపోతోందని, ఆకు, గూడ రాలిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజులు ఇలాంటి పరిస్థితే కొనసాగితే ఆశలు వదులుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి సైతం గణనీయంగా పడిపోతుందని చెబుతున్నారు.

Crop Damage Due To No Rains : పత్తి తర్వాత అత్యధికంగా సాగైన వర్షదార పంట మొక్కజొన్న. సుమారు 90వేల ఎకరాల్లో ఈసారి రైతులు మొక్కజొన్న సాగుచేశారు. వానల్లేక ఆ పంట సైతం ఎండిపోతోంది. ఇప్పటికే ఆరేడు అడుగులు పెరగాల్సిన మొక్క ఎత్తు నాలుగైదు అడుగులకు మించలేదు(Crop damage to no Rains). నీరు లేక కంకి సైతం నాణ్యంగా లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు ఆశల్లేక పంటను అలాగే వదిలేశారు. ఎకరాలకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఐదారు క్వింటాళ్లు దాటదని రైతులు అంచనా వేస్తున్నారు.

Cotton Farmers Problems in Telangana : వరుణుడు కరుణించేనా.. అన్నదాతకు కన్నీళ్ల సాగు తప్పేనా

కంది 80వేల ఎకరాల్లో సాగవ్వగా ఆ పంట పరిస్థితీ అంతంత మాత్రంగానే ఉంది. 5లక్షల ఎకరాల్లో వరిసాగు కావాల్సి ఉండగా.. వానల్లేక కేవలం 3లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు వరిసాగుచేశారు. జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయల్ సాగర్, కేఎల్ఐ లాంటి ప్రాజెక్టుల కింద, బోరుబావులు ఇతర నీటి వనరులపై ఆధారపడ్డ రైతులు మాత్రమే ఈసారి వరి వైపు మొగ్గు చూపారు. వానల ప్రభావం ప్రస్తుతానికి వారిపై అంతగా లేదు.

"వర్షాలు లేక మొదట్లో విత్తనాలు వేసి నష్టపోయాం. వర్షాలు లేక విత్తనాలు విత్తక రెండు మూడు సార్లు నష్టపోయాం. తర్వాత కురిసిన వర్షాలకు పొలంలో కలుపు వచ్చింది. అయినా కూడా ఏదో విధంగా పొలాన్ని కాపాడుకుందాం అనుకునే సరికి వర్షాలు కురవడం లేదు. పరిస్థితి ఇలానే ఉంటే ఉన్న కాస్త పొలం కూడా చేతికి రాకుండా పోతుంది." - బాధిత రైతులు

పూర్వ పాలమూరు జిల్లాలోని 76మండలాల్లో ఆగస్టు 20 నాటికి 21మండలాల్లో అధిక వర్షాలు, 48 మండలాల్లో సాధారణ వర్షాలు నమోదయ్యాయి. 7మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. వానలు కురిసిన తీరు కూడా వ్యవసాయానికి ఉపయోగపడలేదు. సీజన్ మొదట్లో అసలు వానలే కురవలేదు. ఒకట్రెండు వర్షాలు అడపా దడపా వచ్చిపోయాయి. జూలైలో దంచికొట్టిన వానలు మళ్లీ ఆగస్టులో ముఖం చాటేశాయి. ఇదిలాగే కొనసాగితే సాగుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడక తప్పదని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు.

Cotton Farmers Problems in Telangana : వరుణదేవా.. కరుణించరా.. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటంతా..!

NO RAINS: ఊరించి ఉసూరుమనిపించిన వరుణుడు.. లబోదిబోమంటున్న రైతన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.