ETV Bharat / state

Funds for GRMB : 'గోదావరి బోర్డుకు నిధులు ఇవ్వండి'

author img

By

Published : Mar 28, 2023, 7:51 AM IST

Funds for GRMB : గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు... ఈ ఆర్థిక సంవత్సరం ఇవ్వాల్సిన నిధులు వీలైనంత త్వరగా విడుదల చేయాలని కేంద్ర జలశక్తి శాఖ తెలుగు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్... రెండు రాష్ట్రాల సీఎస్‌లకు విడివిడిగా లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం గోదావరి బోర్డు తన విధుల నిర్వహణకు అవసరమయ్యే నిధులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇవ్వాలని పేర్కొన్నారు.

GRMB
GRMB

Funds for GRMB : గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాలు నిధులు ఇవ్వలేదని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. వీలైనంత త్వరగా నిధులు ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు విడివిడిగా లేఖలు రాశారు.

Funds for Godavari River Management Board : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం గోదావరి బోర్డు తన విధులు నిర్వర్తించేందుకు అవసరమయ్యే నిధులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని లేఖలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్‌ పేర్కొన్నారు. 2022-23 సంవత్సరానికి పది కోట్లతో జీఆర్ఎంబీ బడ్జెట్‌ను ఆమోదించారని తెలిపారు. అందులో ఏపీ రూ.10 కోట్లకు గాను రూ.3.84 కోట్లు, తెలంగాణ రూ.10 కోట్లకు రూ.5.27 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. వీలైనంత త్వరగా ఈ నిధులు విడుదల చేయాలని కోరారు.

Godavari River Management Board Funds : ఈ విషయమై జులై, సెప్టెంబర్, జనవరి నెలల్లో రెండు రాష్ట్రాలకు గోదావరి బోర్డు లేఖ రాసినట్లు కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని ఆ లేఖలో కోరినట్లు వెల్లడించింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గోదావరి బోర్డుకు నిధులు ఇవ్వలేదని చెప్పింది.

ఉద్యోగుల వేతనాలు, ఇతర అవసరాల కోసం బోర్డు వద్ద ఉన్న రిజర్వ్ నిధులను ఉపయోగించుకుందని పంకజ్ కుమార్ తెలిపారు. అవి కూడా దాదాపుగా అయిపోయినట్లు తమకు సమాచారం ఇచ్చారని తెలుగు రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు చట్టబద్ధంగా తమ బాధ్యతలను నెరవేర్చాలని సూచించారు. గోదావరి బోర్డుకు తక్షణమే నిధులు విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కోరారు.

మరోవైపు కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో పనిచేసే రాష్ట్ర ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సును రద్దు చేయాలని బోర్డు ఛైర్మన్‌ ఆదేశించారు. ఇప్పటివరకు చెల్లించిన మొత్తాన్ని వసూలు చేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటవగా.. ఇక్కడ పని చేసేందుకు డిప్యూటేషన్‌పై వచ్చే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలని 2021లో బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కృష్ణా బోర్డులో పనిచేసే వారికి మాత్రమే ఈ సదుపాయాన్ని వర్తింపజేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.