ETV Bharat / bharat

సీబీఐపై సుప్రీంకోర్టు అసహనం.. ఇంకెంత కాలం వివేకా హత్య కేసును విచారిస్తారు..?

author img

By

Published : Mar 27, 2023, 12:26 PM IST

Updated : Mar 28, 2023, 6:29 AM IST

viveka
viveka

SC on YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తుకు సంబంధించి.. సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఇంకెంత కాలం విచారిస్తారంటూ.. సీబీఐపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో వాదోపవాదనలు విన్న ధర్మాసనం.. CBI డైరెక్టర్ విజ్ఞతకు విలువ ఇద్దామంటూ.. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేస్తూ.. ఈలోపు సీబీఐ డైరక్టర్‌ నుంచి తగిన నిర్ధేశాలు తీసుకుని చెప్పాలని సంస్థ తరపు న్యాయవాదికి సూచించింది.

SC on YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) మరోసారి అసహనం వ్యక్తం చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు పురోగతిలో ఇప్పుటిదాకా ఎలాంటి పురోగతి తమకు కనిపించలేదని.. జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఇంకా ఎన్నేళ్లు విచారణ కొనసాగిస్తారంటూ దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది. ప్రస్తుత దర్యాప్తు అధికారిని కొనసాగిస్తూనే, ఇంకొకరిని నియమించాలని, బుధవారం నాటికి నిర్ణయం చెప్పాలని నిర్దేశించింది. దర్యాప్తు అధికారిని మారిస్తే విచారణలో జాప్యం జరుగుతుందని వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేయగా.. దర్యాప్తు త్వరగా జరగాలన్నదే తమ ఉద్దేశమని.. ధర్మాసనం స్పష్టం చేసింది.

CBI నివేదికపై సుప్రీంకోర్టు అసంతృప్తి: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణ తీరుపై.. సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని, విచారణ అధికారిని మార్చాలని ఈ కేసులో నిందితుడిగా ఉన్న డి.శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు మరోసారి విచారణ జరిపింది. గతవారం విచారణలో CBI దర్యాప్తు స్థాయీ నివేదిక కోరిన సుప్రీంకోర్టు.. అందులోని అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సీబీఐ నివేదికలో ఒక సహనిందితుడి వాంగ్మూలం మినహా కొత్తగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఆక్షేపించింది.

అలా శిక్ష విధించడం సాధ్యం కాదు: అనంతరం 2019, 2020, 2021 సంవత్సరాల్లో ఇది జరిగింది, అది జరిగిందని మాత్రమే నివేదికలో ఉందని.. అందులో రాజకీయ శత్రుత్వం గురించి తప్ప ఇంకేమీ తమకు కనిపించ లేదని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హత్యకు రాజకీయ శత్రుత్వం కారణం కావొచ్చని.. ఐతే, కేవలం ఉద్దేశాల ఆధారంగా నిందితులకు శిక్ష విధించడం సాధ్యం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. దర్యాప్తులో ఎలాంటి పురోగతీ లేనందున అధికారిని మార్చాలని మీ డైరెక్టర్‌కు చెప్పాలంటూ... CBI తరపు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. తదుపరి దర్యాప్తును ఇంకా ఎన్నేళ్లు కొనసాగిస్తారని నిలదీసింది. తదుపరి దర్యాప్తు పూర్తిచేసి హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని తేల్చకపోతే ట్రయల్ జరగదని న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఆర్‌ షా వ్యాఖ్యానించారు.

ఆ కేసులకు ఎలాంటి సంబంధం లేదు: ఏప్రిల్ చివరికల్లా.. దర్యాప్తు మొత్తం పూర్తి చేస్తామని స్టేటస్ రిపోర్టులో దర్యాప్తు అధికారి పేర్కొన్నట్లు సీబీఐ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దర్యాప్తును జాప్యం చేయడానికి పిటిషనర్లు పదేపదే కేసులు వేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు ఆ కేసులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అనంతరం హత్యకేసు దర్యాప్తు చేసే తీరు ఇది కాదని న్యాయస్థానం ఆక్షేపించింది. ఇక ముందు అత్యంత వేగంగా పూర్తి చేస్తామని సీబీఐ న్యాయవాది తెలుపగా.. న్యాయమూర్తి అందుకు అంగీకరించలేదు. మీరు దర్యాప్తు అధికారిని మార్చండంటూ.. సీబీఐ తరపు న్యాయవాదికి సూచించారు. ఈ దశలో వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది జోక్యం చేసుకున్నారు.

అధికారిని మారిస్తే దర్యాప్తులో కంటిన్యుటీ దెబ్బ తింటుంది: ఈ కేసులో అనుమానితులు పదేపదే కేసులు దాఖలు చేయడం వల్లే విచారణలో జాప్యం జరుగుతోందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి.. దర్యాప్తు సరిగా జరగలేదని గతంలో మీరు కూడా పిటిషన్‌ వేశారు కదా అని గుర్తు చేశారు. ఐతే.. తాము సీబీఐకి వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలూ చేయలేదని సునీత తరపు న్యాయవాది వివరించారు. ఈ కేసులో ఏ అధికారి ఉండాలనే విషయంతో మీకేం సంబంధం అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇప్పుడు అధికారిని మారిస్తే దర్యాప్తులో కంటిన్యుటీ దెబ్బ తింటుందని, అది మరింత జాప్యానికి దారితీస్తుందని సునీత తరఫు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు.

సీబీఐపై తమకు పూర్తి విశ్వాసం ఉంది: న్యాయవాది ఆందోళపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఆర్‌ షా... ఆ విషయాన్ని CBI డైరెక్టర్ చూసుకుంటారని అన్నారు. ప్రస్తుత దర్యాప్తు అధికారి కొనసాగుతూనే, అదనంగా మరో అధికారి ఉంటారని పేర్కొన్నారు. ఏప్రిల్ చివరిలోగా దర్యాప్తు పూర్తి చేస్తామని CBI కోరినందున వారికి ఒక అవకాశం ఇవ్వాలని.. సునీత తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ దశలో స్పందించిన సీబీఐ న్యాయవాది.. తాము ఆమె విజ్ఞప్తిపై ఆధారపడటం లేదని కోర్టుకు తెలిపారు. దీనిపై జోక్యం చేసుకున్న న్యాయమూర్తి.. ఇక్కడ ఆరోపణలు కాదని, దర్యాప్తు వేగంగా జరగాలన్నదే తమ ముఖ్య ఉద్దేశ్యం అని వ్యాఖ్యానించారు. తదుపరి దర్యాప్తు వేగంగా జరగాలనే వాదనను స్వాగతించాలని.. సునీత తరపు న్యాయవాదికి సూచించారు. సీబీఐ.. ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అంగీకారమేనని.. తమకు పూర్తి విశ్వాసం ఉందని సునీత తరపు న్యాయవాది.. కోర్టుకు తెలిపారు.

మీరేమీ సూచనలు చేయకపోవడమే మంచిది: దర్యాప్తు అధికారిని మార్చడంపై ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేకుండా.. CBI డైరెక్టర్ విజ్ఞతకు విలువ ఇద్దామని ధర్మాసనం పేర్కొంది. ఐతే సీనియర్ అధికారిని నియమించొచ్చన్నది సలహా అని సునీత తరపు న్యాయవాది వ్యాఖ్యానించగా.. అది సీబీఐకి వదిలేయాలని, ఇలాంటి విషయాల్లో మీరేమీ సూచనలు చేయకపోవడమే మంచిదని ధర్మాసనం సూచించింది. హత్య కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈనెల 29కి (బుధవారం) వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈలోపు సిబిఐ డైరక్టర్‌ నుంచి తగిన నిర్ధేశాలు తీసుకుని చెప్పాలని సంస్థ తరపు న్యాయవాదికి సూచిస్తూ... విచారణ వాయిదా వేసింది.

ఇవీ చదవండి

Last Updated :Mar 28, 2023, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.