High Wind Havoc in Bhadradri Kothagudem District : ఓవైపు వేసవిలో కురిసిన అకాల వర్షాలు రైతులను నానా ఇబ్బందులకు గురిచేశాయి. ఈక్రమంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ప్రధానంగా అశ్వరావుపేటలో పెనుగాలులకు పదుల సంఖ్యలో పూరిళ్లు పడిపోయాయి. పలు ఇళ్లపై వేసిన రేకులు కూడా ఎగిరిపోయాయి. గ్రామం సమీపంలోని ఉన్న పామాయిల్ తోటల్లోని పదుల సంఖ్యలో చెట్లు నెేలకొరిగాయి. మరోవైపు మల్లాయగూడెంలో గాలివాన అక్కడ ప్రజలను భయభ్రాంతులను చేసింది. గిరిజనులు నిర్మించుకున్న 21 పైగా ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయి.. చెట్ల కొమ్మల్లో చిక్కుకున్నాయి. అవి ఎవరి మీద పడతాయోనని వారు భయంతో వణికిపోయారు. పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే చెట్లు విరిగి ఇళ్లపై పడ్డాయి. గాలివానతో మల్లాయగూడెంలో 20 కుటుంబాల వారు వీధిని పడాల్సి వచ్చింది. దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో సైతం ఈ అకాల వర్షం పెను నష్టాన్ని మిగిల్చింది. తమపై దయచూపి ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.