సమయం, సందర్భాన్ని బట్టి తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr into national politics news) జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు(Telangana Minister KTR news) తెలిపారు. ఆయనకు ఉప రాష్ట్రపతి పదవి అనేది వాట్సప్ యూనివర్సిటీ ప్రచారమే తప్ప నిజం లేదని చెప్పారు. ప్రపంచంలోని అతి గొప్ప పథకాల్లో ఒకటైన దళితబంధును(Dalitha bandhu in telangana) ఆపడం ఎవరి తరం కాదన్నారు. నవంబరు 3 తర్వాత అది రాష్ట్రమంతటా యథాతథంగా కొనసాగుతుందని వెల్లడించారు. తెలంగాణభవన్లో కేటీఆర్ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మంగళవారం మాట్లాడారు.
కావాలనే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలిపింది
‘‘నాగార్జునసాగర్లో సీనియర్ కాంగ్రెస్నేత జానారెడ్డిని ఓడించాం... ఈటల రాజేందర్ అంతకన్నా గొప్ప నేతేం కాదు. హుజూరాబాద్లో తెరాస కచ్చితంగా గెలుస్తుంది. రేవంత్, ఈటల తదితరులు తెరాసపై కుట్రకు తెరలేపారు. కావాలనే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలిపింది. ఈటలకు ఓటెయ్యాలని ఓ కాంగ్రెస్ మాజీ ఎంపీ లేఖ రాయడం కుమ్మక్కులో భాగమే. టీపీసీసీ అధ్యక్షునిగా తొలి ఉపఎన్నిక కోసం హుజూరాబాద్కు వెళ్లకుండా రేవంత్ చిలకజోస్యం చెబుతున్నారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న రేవంత్ ఆ పని చేయలేదు. దమ్ముంటే ఇప్పుడైనా హుజూరాబాద్లో కాంగ్రెస్కు డిపాజిట్ తెచ్చుకోవాలి. ఈటల బలవంతంగా భాజపా బురదను అంటించుకున్నారు. ఆ పార్టీని మాత్రం సొంతం చేసుకోవడం లేదు. ఓడిపోతామనే భయంతో జైశ్రీరామ్ అనడం లేదు. తెరాస ఎంతో చేసినా పార్టీకి ఎందుకు రాజీనామా ఇచ్చారో రాజేందర్ చెప్పడంలేదు. వేరే విషయాలు మాట్లాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఈటల, వివేక్, ఇతర నేతలు గంపగుత్తగా కాంగ్రెస్లో చేరతారు. నేను హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లడం లేదు. దానికి అపార్థాలు ఆపాదించవద్దు. గతంలో నాగార్జునసాగర్, దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లలేదు. ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ ప్రచారం షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. వచ్చే నెల 15న వరంగల్లో విజయగర్జన సభ దృష్ట్యా ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుంది. అందువల్ల ఆరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం."
-కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు