తెలంగాణ

telangana

క్లైమాక్స్​కు అమెరికా-అఫ్గాన్ కథ.. డెడ్​లైన్​కు 24 గంటలే!

By

Published : Aug 30, 2021, 5:30 PM IST

సమయం ఆవిరైపోయింది... రోజులు కరిగిపోయాయ్... ఇక మిగిలింది కొద్ది గంటలే! ప్రాణాలమీద ఆశతో దేశం విడిచి వెళ్లాలన్న ప్రజల తపన ఓవైపు... గడువు ముగిసేలోపు వీలైనంత మందిని వెనక్కి తీసుకురావాలని(afghan evacuation) దేశాల ప్రయత్నాలు మరోవైపు. కాబుల్ ఎయిర్​పోర్ట్​ను ముష్కర మూకలు లక్ష్యంగా(kabul airport attack) చేసుకొని దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో... ఈ కొద్ది గంటల్లో ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రపంచం నిశితంగా పరిశీలిస్తోంది.

us troops deadline 24 hours
అఫ్గాన్ అమెరికా

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ(us troops withdrawal from afghanistan)కు గడువు కొద్ది గంటల్లో ముగియనుంది. దేశం విడిచి వెళ్లేందుకు ఆగస్టు 31 చివరి తేదీ కాగా.. ఆ లోపు తమకు సహకరించిన పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.

అఫ్గాన్​లో సుమారు 300 మంది అమెరికా పౌరులు దేశం విడిచి రావాలని అనుకుంటున్నారని, వారిని వెనక్కి తీసుకొచ్చే సామర్థ్యం తమకు ఉందని శ్వేతసౌధ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వారం రోజుల క్రితమే పౌరుల తరలింపు ప్రక్రియను అమెరికా(us evacuation from afghanistan) వేగవంతం చేసింది. కాబుల్ ఎయిర్​పోర్ట్ వద్ద వరుస ఆత్మాహుతి దాడులు(kabul airport attack) జరిగిన తర్వాత కూడా ఈ వేగాన్ని కొనసాగిస్తోంది. అప్రమత్తంగా ఉంటూనే.. ప్రజలను తీసుకొస్తోంది.

ఏంటీ డెడ్​లైన్?

ట్విన్​ టవర్స్​పై దాడి తర్వాత అఫ్గాన్​లో అల్​ఖైదాపై ప్రతీకారం తీర్చుకోవడానికి అఫ్గానిస్థాన్​లో అమెరికా దళాలు 2001లో అడుగుపెట్టాయి. దేశంలోని తాలిబన్ల ప్రభుత్వాన్ని పడగొట్టి.. ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది అగ్రరాజ్యం. ఈ ఘటన జరిగి 20 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి వైదొలగాలని అమెరికా భావించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ మేరకు తాలిబన్లతో శాంతి ఒప్పందం(taliban peace deal) చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం అఫ్గాన్​లోని 13 వేల మంది అమెరికా దళాలను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిగా అల్​ఖైదాతో సంబంధాలు తెంచుకుంటామని తాలిబన్లు అంగీకరించారు. అమెరికా దళాలపై దాడులు చేయబోమని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం 2021 మే 1 నాటికే బలగాల ఉపసంహరణ పూర్తి కావాలి. అయితే, దీన్ని తర్వాత సవరించారు. ఆగస్టు 31ని చివరి తేదీ(us deadline to leave afghanistan)గా నిర్ణయించారు.

తరలింపు ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది?

ఎన్ని సవాళ్లు ఎదురైనా.. అత్యంత వేగంగా పౌరులను తరలిస్తోంది అమెరికా. ఇప్పటివరకు సుమారు 1,14,400 మందిని అఫ్గాన్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. అమెరికా పౌరులే కాకుండా గత 20 ఏళ్లలో తమకు సహకరించిన అఫ్గాన్ వాసులు సైతం ఇందులో ఉన్నారు. ప్రస్తుతం అఫ్గాన్​లో 4000 మంది అమెరికా సైనికులు ఉన్నట్లు సమాచారం. వీరంతా అఫ్గాన్ ఎయిర్​పోర్ట్ వద్దే పహారా కాస్తున్నారు.

రాకెట్ల దాడులతో...

బలగాల ఉపసంహరణ, పౌరుల తరలింపు ప్రక్రియకు ఉగ్రవాదుల నుంచి పెను ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కాబుల్ ఎయిర్​పోర్ట్ లక్ష్యంగా ఐసిస్-కే ముష్కరులు దాడులకు(isis k attack) పాల్పడ్డారు. గురువారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో సుమారు 180 మంది మరణించారు. ఇందులో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు.

ఆదివారం సైతం కాబుల్​లో ఉద్రిక్తతలు తలెత్తాయి. భారీ ఉగ్రకుట్రను అమెరికా సైన్యం విజయవంతంగా అడ్డుకుంది. కాబుల్​ విమానాశ్రయంవైపు దూసుకెళుతున్న ఐసిస్​కు చెందిన ఓ వాహనాన్ని వైమానిక దాడులతో ధ్వంసం చేసింది. ఆదివారం సైతం రాకెట్ దాడులు జరిగాయి. ఈ పరిస్థితుల మధ్యే ఉపసంహరణ ప్రక్రియ కొనసాగిస్తోంది అమెరికా.

ఇతర దేశాల మాటేంటి?

అమెరికాలో గత 20 ఏళ్లుగా అఫ్గాన్​లో సైనిక కార్యకలాపాలు నిర్వహించిన బ్రిటన్.. ఆదివారం తన ప్రస్థానాన్ని ముగించింది. అఫ్గాన్​లోని బ్రిటన్ రాయబారి సహా మిగిలిన సైనికులు స్వదేశానికి చేరుకున్నారు. అంతకుముందే, తమ పౌరులను వెనక్కి తెచ్చుకుంది బ్రిటన్. సుమారు 15 వేల మందిని తరలించింది. మరికొందరు ఇష్టపూర్వకంగా అఫ్గాన్​లోనే ఉంటామని చెప్పారని తెలిపింది.

డెడ్​లైన్ తర్వాత శరణార్థులు బయటకు వెళ్లాలంటే?

వాణిజ్య విమానాలపై నిషేధం ఉన్నందున.. ఆగస్టు 31 తర్వాత అఫ్గానిస్థాన్​లోని పౌరులు బయటకు వెళ్లడం కష్టమే. అయితే, గడువు తర్వాత కూడా వీరికి అనుమతులు ఇవ్వాలని జీ7 దేశాలు కోరుతున్నాయి. శరణార్థులుగా వెళ్లాలనుకునే వారి వివరాలను అఫ్గాన్​లోనే సేకరించి ఇతర దేశాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. దీనికి తాలిబన్లు ఒప్పుకుంటారా లేదా అన్న విషయంపై సందిగ్ధం నెలకొంది. ఉపసంహరణ గడువును పెంచేందుకు తాలిబన్లు తిరస్కరించారు.

ఈ పరిస్థితుల్లో ఆగస్టు 31 తర్వాత ఏం జరగనుంది? ఆలోపు అమెరికా తన ప్రజలను, సైన్యాన్ని అఫ్గాన్ నుంచి తరలిస్తుందా? మధ్యలో ఐసిస్ వంటి ఉగ్ర సంస్థలు ఎలాంటి కుట్రలకు పాల్పడుతుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి:

మహిళలకు ఇక నరకమే- ట్రైలర్​ చూపించిన తాలిబన్లు

చైనా చిలుక పలుకులు- తాలిబన్లకు 'దారి' చూపాలట!

ABOUT THE AUTHOR

...view details