తెలంగాణ

telangana

Kishanreddy on TS Assembly Elections : 'వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకెళ్తాం'

By

Published : Jul 5, 2023, 3:40 PM IST

Updated : Jul 5, 2023, 5:03 PM IST

kishanreddy
kishanreddy

15:37 July 05

Kishanreddy : 'వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకెళ్తాం'

వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకెళ్తాం : కిషన్​రెడ్డి

Kishanreddy on Telangana Assembly Elections 2023 : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి అధికారమే లక్ష్యంగా అందరితో కలిసి పనిచేస్తానని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. పార్టీ గుర్తించి ఇచ్చిన అన్ని బాధ్యతలను నిర్వర్తించానన్న ఆయన... ఫలానా కావాలని పార్టీని ఎప్పుడూ ఏదీ అడగలేదన్నారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్​రెడ్డి... ప్రధాని వరంగల్ పర్యటనకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఈనెల 8న ప్రధాని మోదీ వరంగల్‌కు రానున్నారని తెలిపారు.

తాను ఎప్పుడూ పార్టీ నుంచి ఏమీ ఆశించలేదు : ప్రధాని మోదీ వరంగల్‌లో... రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌కు భూమిపూజ చేస్తారని కిషన్​రెడ్డి తెలిపారు. వరంగల్ ఆర్ట్స్‌ కళాశాల మైదానం నుంచి వర్చువల్‌గానే ప్రధాని శంకుస్థాపనలు చేస్తారన్నారు. 150ఎకరాల విస్తీర్ణంలో రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ నిర్మాణం జరగనుందన్న ఆయన... రోజుకు 3 వ్యాగన్లు తయారు చేసే యూనిట్‌ను వరంగల్​లో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వరంగల్‌లో ఆర్​ఎంయూ ద్వారా... 5వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ప్రధాని మోదీ తనకు బాధ్యతలు ఇచ్చారన్న కిషన్‌రెడ్డి... తాను ఎప్పుడూ పార్టీ నుంచి ఏమీ ఆశించలేదని పేర్కొన్నారు.

'మొదటిసారి ఎంపీగా గెలిచా. నాలుగేళ్లలో సుమారు రెండేళ్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చేశాను. కేంద్ర మంత్రిగా ప్రధాని మోదీ నాకు బాధ్యతలు ఇచ్చారు. దీంతో మరో రెండేళ్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా చేశాను. ఎప్పుడూ పార్టీని ఏదీ అడగలేదు. మంత్రి అవుతానని.. కావాలని .. ఏదీ అడగలేదు. పార్టీయే నన్ను గుర్తించింది. ఇప్పటివరకు పార్టీ ఆదేశాలను పాటిస్తూ వచ్చాను. 1980 నుంచి ఈరోజు వరకు పార్టీ సైనికుడిగా పనిచేశా. నాకు పార్టీకి మించి ఏదీ లేదు. పార్టీయే నా శ్వాస. పార్టీ కోసం.. పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం.. అందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా.'-కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

హైదరాబాద్‌లో దక్షిణ భారత రాష్ట్రాల సమావేశం : ఈనెల 9న దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమైన నాయకులతో కూడిన సమావేశాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నామని కిషన్​రెడ్డి తెలిపారు. కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, లక్షద్వీప్ చెందిన నాయకులు సమావేశానికి హాజరవుతారన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ తీసుకోవాల్సిన చర్యలు, రానున్న పార్లమెంట్‌ ఎన్నికలకు సన్నద్ధం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై భేటీలో చర్చిస్తామని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ ఉంటుందని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రధాని పర్యటన తర్వాతే అధ్యక్ష బాధ్యతలు చేపడుతా :ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న వరంగల్ పర్యటన తర్వాత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఈరోజు కేంద్ర మంత్రివర్గ సమావేశానికి దూరంగా ఉన్న ఆయన... అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోతున్నట్లు దిల్లీలో చెప్పారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నగరానికి కిషన్​రెడ్డి రానున్నారు. అందుబాటులో ఉన్న పార్టీ పదాధికారులు, అధికార ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలతో అత్యవసర సమావేశమవుతారు. ఈ సమావేశంలోనే మోదీ పర్యటనపై సమీక్షిస్తారు. రేపు ఉదయం వరంగల్‌ వెళ్లనున్న కిషన్ రెడ్డి ఈ నెల 8వ తేదీ వరకు అక్కడే ఉంటారు.

ఇవీ చదవండి :

Last Updated :Jul 5, 2023, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details