ETV Bharat / state

BJP Change Telangana President : కీలకమైన ఎన్నికల సమయంలో.. సారథ్య బాధ్యతలకు దూరమైన సంజయ్‌

author img

By

Published : Jul 5, 2023, 10:41 AM IST

BJP Change Telangana President
BJP Change Telangana President

BJP Announces Kishan Reddy as Telangana President : అనూహ్య పరిస్థితుల్లో అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పగ్గాల్ని దక్కించుకున్న బండి సంజయ్‌.. కీలకమైన ఎన్నికల సమయంలో ఆ బాధ్యతలకు దూరమయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఆయన సారథ్యంలోనే బీజేపీ ఎదుర్కొంటుందని అందరూ భావించినా.. అందుకు భిన్నమైన పరిణామం చోటుచేసుకుంది. ఏదైతే దూకుడు ఆయనను పార్టీలో ముఖ్యనేతగా ఎదిగేలా చేసిందో.. అదే దూకుడు ఆయనను బలహీనతగా మారిందని అంచనా వేస్తున్నారు.

ఎన్నికల సమయంలో సారథ్య బాధ్యతలకు దూరమైన సంజయ్‌

Reasons Behind Telangana BJP President Change : రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించిన బండి సంజయ్‌.. ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్ష పదవికి దూరమయ్యారు. 2020 మార్చిలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత.. దుబ్బాక, హుజురాబాద్‌ ఉపఎన్నికలు, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో కమలం విజయం సాధించింది. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించింది. పలు విడతలుగా ప్రజా సంగ్రామ యాత్రలు చేపట్టిన బండి సంజయ్‌.. భారతీయ జనతా పార్టీ పట్టణానికి పరిమితమనే వాదన నడుమ గ్రామస్థాయికి చేర్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీజేపీ బలోపేతమైందని బీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయమని నేతలు విశ్వసించే స్థితికి పార్టీని చేర్చారు.

BJP Announces Kishan Reddy New Telangana President : బీజేపీ బలోపేతం, ఎన్నికల విజయాలు, జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాల్ని జనంలోకి తీసుకెళ్లడం వంటి సానుకూలతలు ఉన్నా.. కొన్ని అంశాలు సంజయ్‌కు ప్రతికూలంగా మారాయి. ఆయన వ్యవహారశైలిపై పార్టీ సీనియర్‌ నేతల్లో అసంతృప్తే ఇందుకు కారణమని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల పేరుతో అధ్యక్షుడి మార్పు చేశామని దిల్లీ నాయకులు చెబుతున్నప్పటికి.. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Telangana BJP president change : జీహెచ్​ఎంసీలో మంచి ఫలితాలు రాబట్టినా ఫ్లోర్‌ లీడర్‌ను నియమించకపోవడం.. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఫ్లోర్‌ లీడర్‌ను పెట్టకపోవడం వంటివి బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి. సీనియర్‌ నేతల్ని విస్మరిస్తూ ముందుకెళ్తున్నారని పార్టీలో చర్చ మొదలైంది. సంజయ్‌ ఒంటెద్దు పోకడలతో పార్టీకి నష్టం జరుగుతుందని కొందరు నాయకులు వాదన వినిపించారు. మునుగోడు ఉపఎన్నిక విషయంలో సంజయ్‌ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈటల రాజేందర్‌, రఘునందనరావుతో సమన్వయం లేకపోవడం.. ఎమ్మెల్యే రాజాసింగ్​పై సస్పెన్షన్‌ ఎత్తివేతపై స్పష్టత లేకపోవడం, శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక విషయంలో ఉదాసీనత.. సీనియర్‌ నేతల కినుకకు కారణమయ్యాయి. రాష్ట్ర పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఈటలను నియమించినా.. ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకునే విషయంలో ఆయనతో పాటు సంబంధిత జిల్లాల ప్రజా ప్రతినిధులను పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి.

బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు.. రాష్ట్ర సారథ్యం సహా మార్పులు : నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి చేరిక విషయంలో.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పార్టీ నేతల అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోలేదని హైకమాండ్ దృష్టికి వెళ్లింది. ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందని ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, ధర్మపురి అర్వింద్‌, రఘునందన్​రావుతో పాటు.. పలువురు నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో పాటుగా బహిరంగంగానే విమర్శలు చేశారు.

BJP Focus on Telangana Assembly Elections : రఘునందన్​రావు నేరుగానే బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. విభేదాలు పక్కనపెట్టి సమష్ఠిగా పని చేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని.. దిల్లీ పెద్దలు దిశా నిర్దేశం చేసిన ఫలితం లేకుండా పోయింది. కొత్త పాత నేతల మధ్య అంతరం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సారథ్యం సహా మార్పులు చేయాలని అగ్రనాయకత్వం నిర్ణయించింది.

BJP Focus on Telangana Assembly Elections : తెలంగాణ బీజేపీకు కొత్త అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని నియమించిన తర్వాత పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉన్నట్టుండి బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తొలగించడాన్ని పలువురు సీనియర్లు తప్పుపడుతున్నారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక అధిష్ఠానం వ్యవహారశైలిపై మాజీ ఎంపీ వివేక్, జితేందర్​రెడ్డి, విజయశాంతి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ సేవలను కొనియడుతూ విజయశాంతి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయం మరో వర్గాన్ని ఆగ్రహానికి గురి చేస్తోందని పేర్కొన్నారు.

Kishan Reddy Appointed Telangana BJP President : రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పట్ల కేంద్రమంత్రి కిషన్​రెడ్డి స్పందించలేదు. మీడియా ప్రతినిధులు చుట్టు ముట్టి ప్రశ్నలు సంధించినా మౌనంగా వెళ్లిపోయారు తప్పితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని తనను తప్పించడం పట్ల బండి సంజయ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్టీ అవసరాల మేరకే మారుస్తున్నామని జాతీయ అధ్యక్షుడు నడ్డా చెప్పినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.