ETV Bharat / bharat

'నేను బతికున్నంతకాలం ఎస్​సీ, ఎస్​టీ రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరు- ఇది మోదీ గ్యారెంటీ' - lok sabha election 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 4:21 PM IST

Updated : May 23, 2024, 5:24 PM IST

PM Modi On INDIA Alliance : తాను బతికున్నంత కాలం ఎస్​సీ, ఎస్​టీ రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు కావాలని ఇండియా కూటమి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. హరియాణాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పింతారు.

PM Modi On INDIA Alliance
PM Modi On INDIA Alliance (ANI)

PM Modi On INDIA Alliance : వచ్చే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు కావాలని ఇండియా కూటమి మాట్లాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆవు పాలు ఇవ్వకముందే నెయ్యి గురించి గొడవ మొదలైందని (ప్రధాని పదవిపై పోటీని ఉద్దేశించి) ఎద్దేవా చేశారు. తాను జీవించి ఉన్నంతవరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని తెలిపారు. హరియాణాలోని మహేంద్రగఢ్​లో జరిగిన ఎన్నికల ర్యాలీలో విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.

రిజర్వేషన్లకు మోదీ గ్యారెంటీ
'ఈ లోక్​సభ ఎన్నికల ద్వారా ప్రజలు దేశ ప్రధానిని ఎన్నుకోవడమే కాకుండా దేశ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తారు. ఒకవైపు మీ సేవకుడు మోదీ. మరోవైపు ఎవరు ఉన్నారో ఎవరికీ తెలియదు. ఇండియా కూటమి అత్యంత మతతత్వ, కులతత్వ, బంధుప్రీతి ఉన్న పార్టీల కలయిక. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుమతివ్వలేదు. బంగాల్​లో టీఎంసీ సర్కార్ రాత్రికి రాత్రే ముస్లింలకు(చొరబాటుదారులకు) ఓబీసీ సర్టిఫికేట్​లను జారీ చేసింది. గత 10-12 ఏళ్లలో ముస్లింలకు జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్‌లను కలకత్తా హైకోర్టు చెల్లుబాటు కాకుండా చేసింది. కాంగ్రెస్, టీఎంసీ, ఇండియా కూటమి పార్టీలు వారి ఓటు బ్యాంకుకు మద్దతు ఇస్తున్నాయి. అయితే మోదీ బతికున్నంతకాలం దళితులు, గిరిజనుల రిజర్వేషన్​లను ఎవరూ లాక్కోలేరు. నేను ప్రజలకు గ్యారెంటీ ఇస్తున్నా. మోదీ మీ రిజర్వేషన్లకు కాపలాదారు. అణగారిన వారి హక్కుల కోసం పోరాడతాను. ఇది రాజకీయ ప్రసంగం కాదు. మోదీ గ్యారెంటీ. ' అని ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

వారికి ఓటు బ్యాంకే ముఖ్యం
కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలకు దేశం కంటే వారి ఓటు బ్యాంకు ముఖ్యమని ప్రధాని మోదీ విమర్శించారు. అందుకే విపక్ష కూటమి నేతలు తమ ఓటు బ్యాంకు కోసం దేశాన్ని విభజించారని ఆరోపించారు.
లోక్​సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ మే 25న జరగనుంది. ఈ విడతలోనే హరియాణాలో ఉన్న 10 లోక్​సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అధికార బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీ పోరు జరగనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

'ప్రజ్వల్ రేవణ్ణ పాస్​పోర్ట్​ను రద్దు చేయండి'- మోదీకి కర్ణాటక సీఎం లేఖ

'ప్రధాని మోదీని చంపేస్తా'- NIA కంట్రోల్ రూమ్​కు ఫోన్ కాల్- పోలీసులు అలర్ట్ - THREAT CALL FOR PM MODI

Last Updated : May 23, 2024, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.