తెలంగాణ

telangana

'ఎగిరే సైనికుడు'.. భారత సైన్యానికి అదనపు బలం.. ఇక ప్యారాచూట్ లేకుండానే..

By

Published : Feb 16, 2023, 7:20 AM IST

భారత సైనిక వ్యవస్థ మరో ముందడుగు వేసింది. వాయువేగంతో పయనించే ఫైటర్ జెట్​లు, డ్రోన్ల వరుసలో ఎగిరే సైనికులు వచ్చి చేరనున్నాడు. ప్యారాచూట్‌ల అవసరం లేకుండానే పక్షిలా ఎగురుతూ లక్ష్యాలను చేరేందుకు స్టార్టప్ సైనిక దుస్తులను బెంగళూరుకు చెందిన ఓ సంస్థ తయారు చేసింది. ఈ దుస్తుల ప్రత్యేకలేంటో ఓ సారి తెలుసుకుందాం.

flying soldier news
ఎగిరే సైనికుడు

భారతీయ సైనిక వ్యవస్థలో వాయువేగంతో పయనించే ఫైటర్‌ జెట్‌లు, డ్రోన్ల వరుసలో త్వరలో ఎగిరే సైనికుడు వచ్చి చేరనున్నాడు. ప్యారాచూట్‌ల అవసరం లేకుండానే పక్షిలా ఎగురుతూ లక్ష్యాలను చేరేందుకు బెంగళూరుకు చెందిన అబ్సల్యూట్‌ కంపోజిట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఏసీపీఎల్‌) అనే స్టార్టప్‌ సైనిక దుస్తులను (జెట్‌ప్యాక్‌) తయారు చేసింది. అవి ప్రస్తుతం బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియా ప్రదర్శనలో దేశ, విదేశీ సైనిక సంస్థలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వాటి ప్రత్యేకతలిలా ఉన్నాయి.

టర్బైన్‌ టెక్నాలజీ
టర్బోజెట్‌ల పనితీరును పోలిన ఇంధన వ్యవస్థలు జెట్‌ప్యాక్‌లో ఉన్నాయి. ఇందులో ఇంధనంతో మండించే చిన్నపాటి కంప్రెసర్లతో కూడిన టర్బో ఇంజిన్‌, 30 లీటర్ల డీజిల్‌ ట్యాంకు అమర్చారు. ఎయిర్‌ ఇన్‌లెట్‌ కాంపాక్ట్‌ ఫ్లయింగ్‌ మిషన్‌ విధానంతో ఎగిరే వ్యవస్థలు ఉన్నాయి. పర్వతాలు, ఎడారులు, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో రక్షణ చర్యలు, హిట్‌ అండ్‌ రన్‌ ఛేదనలో సైనిక సేవలను మరింత వేగంగా, సమర్థంగా అందించేందుకు జెట్‌ప్యాక్‌లు ఉపయోగపడతాయని స్టార్టప్‌ ఎండీ రాఘవ్‌రెడ్డి తెలిపారు. వీటిని ధరించిన సైనికుడు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో 15 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలడని వెల్లడించారు. వీటిని 70% స్వదేశీ పరిజ్ఞానంతో, పేలోడ్‌తో కలిపి 80 కిలోల బరువుతో తయారు చేశారు. ఇప్పటికే 48 జెట్‌ సూట్‌లను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు రక్షణ శాఖ ప్రతిపాదనల విభాగానికి పంపారు. వీటిని వచ్చేవారం పరీక్షించిన అనంతరం పూర్తిస్థాయిలో సైనిక సేవలకు వినియోగించేందుకు నిర్ణయం తీసుకుంటారు.

'భవిష్యత్తు నిర్మాణమే మా మంత్రం'
'దేశ తొలి ప్రధాని నెహ్రూ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రయత్నించాలని మాత్రమే పిలుపునిచ్చారు. నేడు మోదీ ఆధ్వర్యంలో మన భవితను మనమే రూపొందించుకోవాలన్న (డిజైన్‌ అవర్‌ డెస్టినీ) మంత్రంతో భారత్‌ దూసుకెళ్తోంది' అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టంచేశారు. ఆయన బుధవారం బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శనలో వార్షిక రక్షణ రంగ ఆవిష్కరణ కార్యక్రమం.. 'మంథన్‌'ను ప్రారంభించి మాట్లాడారు. 2023-24 బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయించిన రూ.1.62 లక్షల కోట్ల మూలధనంలో రూ.లక్ష కోట్ల(75%)ను స్వదేశీ ఉత్పత్తుల తయారీ కోసమే వినియోగించనున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details