కొమురవెల్లిలో మలన్న మూలవిరాట్ దర్శనం నిలిపివేత - తిరిగి ఈనెల 7న పునః ప్రారంభం
Published : Jan 1, 2024, 3:56 PM IST
Komuravelli Mallanna Temple News : సిద్దిపేట జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో ఈరోజు సాయంత్రం నుంచి జనవరి 6వ తేదీ వరకు మూలవిరాట్ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి. ఈనెల 7న స్వామి వారి కల్యాణం సందర్భంగా గర్భాలయంలోని మూలవిరాట్కు అలంకరణ పనులు జరుగుతున్నాయని ఆలయ ఈవో బాలాజీ చెప్పారు. భక్తుల సౌకర్యార్థం అర్థ మండపంలో ఉత్సవ విగ్రహాల దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. వచ్చే ఆదివారం(జనవరి 7న) తెల్లవారుజాము నుంచి భక్తులకు తిరిగి మూలవిరాట్ దర్శనం ప్రారంభం కానుందని ఆలయ ఈవో పేర్కొన్నారు.
Komuravelli Temple Facilities : మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో స్వామి వారి కల్యాణానికి వారం రోజులున్నా అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేయలేని దుస్థితి నెలకొందని భక్తులు అన్నారు. ఆలయ ఆవరణంలో మంచి నీళ్లు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.