Kaleshwaram Project : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ఘట్టం ఆవిష్కృతం... ఏకకాలంలో 35 మోటార్లు రన్​

By

Published : Jul 9, 2023, 11:31 AM IST

thumbnail

Another Milestone Discovered in Kaleshwaram Project : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా అన్ని పంపుహౌస్‌లలో కలిపి ఏకకాలంలో 35 మోటార్లను నడిపించారు. గతంలో లింక్‌-1, 2లోని మోటార్లతో మాత్రమే ఎత్తిపోసేవారు. తాజాగా వీటితోపాటు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలోని పంపుహౌస్‌లలో లింక్‌-4 మోటార్లనూ ఒకేసారి నడిపించారు. వానాకాలం పంటలకు సరిపడా నీరందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రక్రియ ఈ నెల 3న ప్రారంభించగా గోదావరికి ఇన్‌ఫ్లో, విద్యుత్తు లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ క్రమేణా మోటార్ల సంఖ్య పెంచుతున్నారు. శనివారం లక్ష్మి పంపుహౌస్‌లో 7, సరస్వతి, పార్వతి పంపుహౌస్‌లలో 5 చొప్పున, నంది, గాయత్రి పంపుహౌస్‌లలో రెండు చొప్పున మోటార్లను నడిపించారు. ఎస్సారెస్పీ  పునరుజ్జీవ పథకంలోని రాంపూర్‌, రాజేశ్వర్‌రావుపేట, ముప్కాల్‌ పంపుహౌస్‌లలో 4 చొప్పున మొత్తం 12 మోటార్లను నడిపిస్తూ శ్రీరాంసాగర్‌లోకి నీటిని తరలిస్తున్నారు. పథకం నాలుగో లింక్‌లోని అన్నపూర్ణ జలాశయం, రంగనాయకసాగర్‌ పంపుహౌస్‌లలో ఒక్కో మోటారు చొప్పున నడిపించారు. ఇలా మొత్తం 10 పంపుహౌస్‌లలో 35 మోటార్లతో ఎత్తిపోతలు కొనసాగాయి. ఎస్సారెస్పీలో 30  టీఎమ్​సీల నిల్వ చేరే వరకు కాళేశ్వరం జలాలను రోజుకో టీఎమ్​సీ చొప్పున తరలిస్తామని నీటిపారుదలశాఖ ఈఎన్​సీ నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.