ETV Bharat / state

TSPSC Paper Leak Case : పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్టు.. తల్లిదండ్రులకు బిగుస్తున్న ఉచ్చు.!

author img

By

Published : Jul 13, 2023, 10:11 AM IST

TSPSC
TSPSC

TSPSC Paper Leakage Case Latest Update : టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా సోమవారం 18 మందిని, మంగళవారం ముగ్గురిని, బుధవారం మరో ఇద్దరిని అరెస్టుచేశారు. దాంతో ఇప్పటి వరకూ అరెస్టయిన వారి సంఖ్య 80కి చేరింది. అరెస్టయిన వారిని విచారిస్తున్న సిట్ అధికారులకు మరికొన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

Arrests in TSPSC Paper Leakage Case : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో బుధవారం నగర సిట్‌ పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేయగా... ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అరెస్టయిన ఏఈ రమేశ్​ కుమార్‌ వద్ద సుమారు 40 మంది పశ్నపత్రాలు కొనుగోలు చేసినట్టు సిట్‌ గుర్తించింది. వీరిలో ఇప్పటివరకు దళారులు, కొనుగోలు చేసిన 19 మందిని అరెస్టుచేశారు. ఈ ముఠాతో సంబంధాలున్న ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు చెందిన మరో ఆరుగురిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీరివద్ద పూర్తి వివరాలు సేకరించాక అరెస్టు చేసే అవకాశముంది. టీఎస్‌పీఎస్సీ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 80కి చేరింది.

SIT Inquiry in TSPSC Paper Leak : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నగర సిట్‌ పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. కరీంనగర్‌కు చెందిన మద్దెల శ్రీనివాస్‌ అతని కుమార్తె సాహితీలను సిట్‌ అరెస్టు చేసింది. మద్దెల శ్రీనివాస్‌, తన కూతురు సాహితి ఏఈ పరీక్ష రాసేందుకు రమేశ్​ కుమార్‌ సహాయం కోరాడు. రూ.30లక్షల ఒప్పందంతో హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ ద్వారా విజయవంతంగా పరీక్ష రాయించాడు. ఈ వివరాలు వెలుగులోకి రావడంతో తండ్రి, కుమార్తెలను బుధవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

తల్లిదండ్రుల మెడకు పేపర్ లీకేజీ ఉచ్చు : మరోవైపు ఈ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు కొందరు నిందితుల తల్లిదండ్రుల మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రశ్నపత్రాల కోసం డబ్బు చెల్లించిన అనేక మంది, ఆ డబ్బు తమ తల్లిదండ్రుల నుంచే తెచ్చుకున్నారు. అంటే ప్రశ్నపత్రాల లీకేజీ కేసు గురించి చాలామంది తల్లిదండ్రులకు ముందే తెలిసి ఉంటుంది. నేరం గురించి తెలిసీ చెప్పకపోవడం తప్పు కాబట్టి వారిని కూడా ఈ కేసులో జోడించే అవకాశం ఉంది. అయితే వీరిని సాక్షులుగానే పరిగణించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి సిట్‌ అధికారులు న్యాయపరమైన కసరత్తు చేస్తున్నారు.

మరో ముగ్గురి అరెస్ట్‌ : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ అధికారులు మంగళవారం మరో ముగ్గురిని అరెస్టుచేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన వి.నరేష్‌ ఏఈ పూల రమేశ్​ సహాయంతో ఏఈ పరీక్షలో కాపీయింగ్‌కి పాల్పడ్డాడు. నరేష్‌ తన పరిచయాల ద్వారా ఏఈ ప్రశ్నపత్రాలు విక్రయంలో రమేశ్​కు సహకరించాడు. ఈ లింకులను ఛేదించే క్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన వి.నవీన్‌, జి.చంటి, సూర్యాపేట యువకుడు సుమన్‌ ఏఈ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్టు ఆధారాలు లభించడంతో వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

దాదాపు నాలుగు నెలలుగా జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం 18 మందిని, మంగళవారం ముగ్గురిని, బుధవారం ఇద్దరిని అరెస్టుచేశారు. దాంతో ఇప్పటి వరకూ అరెస్టయిన వారి సంఖ్య 80కి చేరింది. కనీసం 150 మంది వరకూ అరెస్టవుతారని భావిస్తున్నారు. చాలామంది అభ్యర్థులు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఓ అభ్యర్థి అయితే ఏకంగా ఏఈ ప్రశ్నపత్రానికి రూ.30 లక్షలు చెల్లించాడు. కేవలం ఏఈ ప్రశ్నపత్రం అమ్మడం ద్వారానే ఓ దళారీ రూ.2.5 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా అనేక మంది పెద్దమొత్తంలో డబ్బు చెల్లించి ప్రశ్నపత్రాలు పొందారు. ఈ పరీక్షలు రాసిన వారిలో ఒకర్దిదరు మినహా మిగతావారంతా నిరుద్యోగులే. తల్లిదండ్రులపై ఆధారపడిన వారే. కాబట్టి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తల్లిదండ్రులను సాక్షులుగా చేర్చాలని పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.