ETV Bharat / bharat

SIT inquiries DE Ramesh in TSPSC Case : 'మాస్ కాపీయింగ్ సూత్రధారి డీఈ రమేశ్‌ లీలలెన్నో'

author img

By

Published : Jun 7, 2023, 7:15 AM IST

HiTech Mass Copying In TSPSC Exams
HiTech Mass Copying In TSPSC Exams

HiTech Mass Copying In TSPSC Exams : టీఎస్​పీఎస్సీ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు సహకరించిన డీఈ పూల రమేశ్‌ నుంచి సిట్​ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. నిందితుడిపై గతంలో నేరచరిత్ర ఉండడంతో అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో జరిగిన ఏదైనా పరీక్షల్లో ఇదే తరహాలో మోసాలకు పాల్పడ్డాడా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. హైటెక్ మాస్ కాపీయింగ్‌లో పూల రమేశ్‌కు సహకరించిన వారి చిట్టాను సిట్ అధికారులు సేకరిస్తున్నారు.

TSPSC Paper Leakage Case Updates : టీఎస్​పీఎస్సీ పరీక్షల్లో హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌తో సంచలనం రేకెత్తించిన నిందితుడు డీఈ పూల రమేశ్‌ కుమార్‌ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో జరిగిన ఏఈఈ, డీఏఓ పరీక్షల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఏడుగురు అభ్యర్థులకు సహకరించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కీలక సమాచారం రాబట్టేందుకు 6 రోజుల కస్టడీకి తీసుకున్నారు. మంగళవారం నాటికి మూడురోజుల కస్టడీ ముగిసింది. ఇప్పటి వరకు అతడి నుంచి ముఖ్యమైన సమాచారం రాబట్టారు. సాంకేతిక పరిజ్ఞానంపై అపారమైన పట్టున్న ఇతడు గతంలోనూ మాస్‌ కాపీయింగ్‌లో అభ్యర్థులకు సహకరించి ఉండొచ్చనే అంచనాకు వచ్చారు.

DE Ramesh Investigation In TSPSC Case : పూల రమేశ్​ కుమార్‌ స్వస్థలం అన్నమయ్య జిల్లా బీ కొత్తకోట. అక్కడే ఉన్నత విద్య పూర్తిచేశాడు. ప్రతిభావంతుడైన రమేశ్‌ 2011లో నీటిపారుదల శాఖలో ఏఈ ఉద్యోగం సంపాదించాడు. అదే సమయంలో ఏఈ కొలువు సంపాదించిన యువతితో వివాహమైంది. 2015లో బీ కొత్తకోట ఠాణా పరిధిలో ఒక మహిళ హత్యకేసులో రమేశ్‌ అరెస్టై జైలుకెళ్లాడు. ఆ సమయంలో సస్పెండ్ కావడంతో సంపాదన కోసం తప్పటడుగులు వేసినట్టు తెలుస్తోంది. 2018లో తిరిగి ఉద్యోగంలోకి చేరినా.. 8 నెలలు మాత్రమే కొనసాగాడు. ఆ తరువాత ప్రభుత్వ కొలువు వదిలేసి ఇతర వ్యాపకాలలో మునిగిపోయాడు. పాత పరిచయాలను అవకాశంగా మలుచుకొని ప్రవీణ్‌ కుమార్‌ స్నేహితుడు సురేశ్​ ద్వారా ఏఈ ప్రశ్నపత్రాలు సేకరించి 78 మందికి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు.

SIT Investigate DE Ramesh In TSPSC Case : టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్‌ కేసులో సిట్‌ పోలీసులు ఏఈఈ, డీఏఓ పరీక్షల్లో టాపర్ల వివరాలు సేకరిస్తున్న సమయంలో పూల రమేశ్ అక్రమాల బాగోతం వెలుగు చూసింది. హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌లో ఏడుగురు అభ్యర్థులకు సహకరించాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.40 లక్షల వరకు తీసుకున్నాడు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కూతురుతో పరీక్ష రాయించినందుకు రూ.70 లక్షలు బేరం కుదుర్చుకున్నాడు. ఆమెకు అవసరమైన ఎలక్ట్రానిక్‌ పరికరాలు తన సొంత డబ్బుతోనే కొనుగోలు చేసినట్టు సిట్‌ ఎదుట అంగీకరించాడు.

HiTech Mass Copying In TSPSC Exams : ఈ వ్యవహారంలో సహకరించిన టోలిచౌకి కళాశాల ప్రిన్సిపల్‌ మహ్మద్‌పాషాకు రూ.8 లక్షలు ఇచ్చినట్టు తెలిపాడు. అతని నుంచి రాబట్టిన వివరాలతో ఏడుగురు అభ్యరులు, ప్రిన్సిపల్, ఏఈ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన 78 మందిని సిట్‌ పోలీసులు గుర్తించారు. వీరికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా పోలీసుల చేతుల్లో ఉన్నట్టు సమాచారం. ఈ జాబితాలో కొందరు ప్రజాప్రతినిధుల పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరో 3 రోజుల పాటు పూల రమేశ్‌ను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. అతని నుంచి ఇంకెన్ని విషయాలు బయట పడతాయో అని సిట్ అధికారులు చూస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.