ETV Bharat / state

RAINS: మన్యంలో జోరు వాన.. పిడుగుపాటుకు ముగ్గురు మృతి

author img

By

Published : Oct 9, 2021, 4:47 PM IST

Updated : Oct 9, 2021, 10:25 PM IST

ఆదిలాబాద్​ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు పలు చోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగు పాటుకు బజార్‌హత్నూర్‌ మండలం బుర్కపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. తాంసి మండలం బండల్‌నాగాపూర్‌లో దీపాలి అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. జైనథ్​ మండలం సాంగ్వి గ్రామంలో పిడుగుపాటుకు 15 మేకలు మృత్యువాతపడ్డాయి.

RAINS: ఆదిలాబాద్​ జిల్లాలో జోరుగా వర్షం.. పిడుగుపాటుకు బాలిక మృతి
RAINS: ఆదిలాబాద్​ జిల్లాలో జోరుగా వర్షం.. పిడుగుపాటుకు బాలిక మృతి

ఆదిలాబాద్‌ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి తోడు పిడుగుపాటు తీవ్ర విషాదం మిగిల్చింది. పిడుగు పాటుకు బజార్‌హత్నూర్‌ మండలం బుర్కపల్లి గ్రామంలో చేనులో పనుల్లో నిమగ్నమైనపు ఒక్కసారిగా పిడుగు పడగా.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. ఇందులో రైతు గరన్‌సింగ్‌, ఆయన సోదరుడి భార్య ఆశాబాయి ప్రాణాలు కోల్పోయింది. తాంసి మండలం బండల్‌నాగాపూర్‌లో మహారాష్ట్ర నుంచి కూలీ పనులకు వచ్చిన యువతి దీపాలి మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని వేదనను మిగిల్చింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను రిమ్స్‌ ఆసుపత్రికి తరలించినా ప్రాణం దక్కలేదు.

పిడుగుపాటుకు మూగజీవాలు బలి

జైనథ్‌ మండలం సాంగ్వి-కె గ్రామంలో రైతు పెరక ఆనంద్​కి చెందిన 15 మేకలు పిడుగుపాటుకి పంటచేనులోనే మృత్యువాతపడగా.. భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటి గ్రామ రైతు షేక్‌ ముజీబ్‌కి చెందిన జోడెడ్లలో ఒకటి పిడుగుపాటుకు బలైంది. కళ్లెదుటే ఎద్దు మృతిచెందడంతో ఆయన బోరున విలపించగా.. ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మొత్తం మీద జిల్లాలో అకాల వర్షం రైతులకు తీరని రోదనను మిగిల్చింది. ఇటీవల కురిసిన వరుస వర్షాల నుంచి తేరుకోకముందే మళ్లీ జోరుగా వర్షం కురియడంతో ఆదిలాబాద్‌, భీంపూర్‌‌, తాంసి, జైనథ్‌, బేల, తలమడుగు మండలాల్లో పత్తి, సోయా పంటలకు నష్టం వాటిల్లింది.

ఇదీ చదవండి: HYDERABAD RAIN ALERT: హైదరాబాద్‌లో ఇవాళ భారీ వర్షాలు.. ఎవరూ బయటికి రావొద్దు: జీహెచ్​ఎంసీ

Last Updated :Oct 9, 2021, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.