ETV Bharat / city

దీపావళి... ఐదు రోజుల పండగంటారు నిజమేనా..?

author img

By

Published : Nov 14, 2020, 6:49 PM IST

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. వెలుగు దివ్వెలతో అమావాస్య చీకట్లను పారదోలే ఈ వేడుక నిజానికి ఐదు రోజుల పాటు జరుపుకోవాలి. అది ఎలా?.. ఏంటనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.

దీపావళి.. ఐదు రోజుల పండగంటారు నిజమేనా..?
దీపావళి.. ఐదు రోజుల పండగంటారు నిజమేనా..?

చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఆస్వాదించే పండుగ దీపావళి. తమ జీవితంలో అమావాస్య చీకట్లను పారదోలి వెలుగు జిలుగులు నింపుకునే సంతోషాల వేడుక ఇది. ఈ తరంలో చాలామంది దీపావళి అంటే ఒక్కరోజు జరుపుకునే పండగ అనుకుంటారు. నిజానికి ఇది ఐదు రోజుల పాటు జరుపుకొనే ఉత్సవం. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలి పాడ్యమి, భగిని హస్త భోజనం (భాయిదూజ్‌)గా జరుపుకొంటారు. విశిష్టతల కలబోతైన వీటి గురించి తెలుసుకుందాం.

ధన త్రయోదశి..

దేవదానవులు అమృతం కోసం మథించిన పాలకడలి నుంచి శ్రీమహాలక్ష్మీ ఉద్భవించింది. ఆమెను భార్యగా స్వీకరించిన శ్రీమహా విష్ణువు ‘ఐశ్వర్యానికి అధిదేవత’గా ప్రకటించాడు. ఇది ఆశ్వీయుజ బహుళ త్రయోదశి. ఈ రోజును ధనాధిదేవత లక్ష్మీదేవి జన్మదినోత్సవంగా భావించి పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే దీన్ని ధన త్రయోదశి అంటారు. అందుకే ఈ రోజున కాస్తైనా బంగారం కొంటారు. లక్ష్మీ నివాస స్థానమైన విష్ణువు గుండెల మీద భృగుమహర్షి తన్నడంతో ఆమె అలిగి భూలోకంలోని కొల్హాపూర్‌కు చేరుతుంది. కుబేరుడు ఆమెను పూజించి అనుగ్రహం పొంది ఎంతో ధనవంతుడు అయ్యాడు. ఆ అమ్మ భూలోకానికి వచ్చిన రోజు కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు.

నరక చతుర్దశి

లోక కంటకుడైన నరకాసుర సంహారం జరిగిన రోజు కాబట్టి ఇళ్లనూ, వాకిళ్లనూ అలంకరించి పూజలు చేస్తారు. ఉదయాన్నే ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టాలి. ఆ రోజు పరిశుభ్రంగా లేని ఇంట్లో ఏడాదంతా దరిద్రం తాండవిస్తుందని ప్రజల నమ్మకం. ఈ రోజు స్వాతీ నక్షత్రం ఉన్నప్పుడు నీటిలో గంగాదేవీ, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి. విష్ణుమూర్తి బాలవటువు రూపంలో మూడు అడుగుల నేల అడిగి బలి చక్రవర్తిని పాతాళానికి అణిచేసిన రోజు కూడా ఇదేనని చెబుతారు.

దీపావళి అమావాస్య

ఈ రోజు పంచత్వక్కులైన మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల బెరళ్లను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి. దరిద్ర దేవతను వెళ్లగొట్టేందుకు శ్రీమహాలక్ష్మిని పూజించాలి. తర్వాత బలి చక్రవర్తిని స్థాపించి ఉత్సవాలు చేయాలి. ఈ రోజున కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తే మంచిది. ధనాధిపతి కుబేరుడినీ పూజించాలి. లక్ష్మీపూజ తర్వాత కొత్త దస్త్రాలూ, ఖాతా పుస్తకాలూ తెరవడం ఆచారం. సాయంత్రం ఏ ఇల్లు ముగ్గులు పెట్టి దీపాలతో అలంకరించి ఉంటుందో ఆ ఇంటసిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మీ దేవి అడుగు పెడుతుందని భక్తుల నమ్మిక.

బలి పాడ్యమి

దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును ‘నవ దివస్‌’గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజూ ఇదే.

భగిని హస్త భోజనం

ఈ రోజును యమ ద్వితీయ, భాయిదూజ్‌గా జరుపుకుంటారు. మగవారు అక్కాచెల్లెళ్ల చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి. దీనికి సంబంధించి అద్భుతమైన కథ ప్రాచుర్యంలో ఉంది. సూర్యభగవానుని కుమారుడు యముడు, అతడి సోదరి యమి/యమున. ఈమె తన సోదరుణ్ని ఎంతో అభిమానించేది. నిత్యమూ అతని మిత్రులతో సహా వచ్చి తన ఇంట్లో విందు చేసి పొమ్మని ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దానికి యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు. అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా, సాదరంగా ఆహ్వానించింది. కనుక వెళ్లితీరాలి అని నిర్ణయించుకుని వెళ్లాడు. అలా వచ్చిన సోదరుణ్ని చూసి సంతోషించి, అతనికి స్నానం చేయించి, తిలకం దిద్ది, స్వయంగా చేసిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది. సంతోషాంతరంగుడైన యముడు ఆమెకు వరం ఇవ్వదలిచి కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది.

ఇదీ చదవండి: నరకాసురుని వధ జరిగింది ఆ జిల్లాలోనే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.