ETV Bharat / international

'గల్వాన్‌ ఘర్షణ జిన్‌పింగ్‌ సాధించిన ఘనత'.. చైనాలో ఘనంగా ప్రచారం

author img

By

Published : Oct 17, 2022, 2:12 PM IST

తూర్పు లద్దాఖ్‌లో కవ్వింపులకు పాల్పడి సరిహద్దుల్లో భారత్‌తో ఉద్రిక్తతలకు కారణమైన చైనా.. దాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. గల్వాన్‌ ఘర్షణ జిన్‌పింగ్‌ సాధించిన ఘనతంటూ సీపీసీ 20వ జాతీయ మహాసభ వేదికపై చైనా ప్రదర్శించింది. యుద్ధంలో పాల్గొని విజయం సాధించడానికి చైనా బలగాలకు శిక్షణ తీవ్రతరం చేయనున్నట్లు ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రకటించారు. ఐతే ఏ దేశం పేరునూ ఆయన ప్రస్తావించలేదు.

INDIA CHINA GALWAN CLASH
INDIA CHINA GALWAN CLASH

భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలకు కారణమై వేలాదిమంది సైనికులు సరిహద్దుల్లో మోహరించేందుకు కారణమైన గల్వాన్‌ ఘర్షణను షీ జిన్‌పింగ్‌ ఘనతగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(CPC) ప్రచారం చేస్తోంది. సీపీసీ 20వ జాతీయ మహాసభ వేదికపై పదేళ్లలో జిన్‌పింగ్ సాధించిన విజయాలను ప్రదర్శించారు. ఇందులో గల్వాన్‌లో భారత్‌-చైనా దళాల ఘర్షణను కూడా చూపించారు. ఈ చిత్రాల్లో పీఎల్‌ఏ కమాండర్‌ క్వీ ఫాబోవా రెండు చేతులు అడ్డంగా పెట్టి భారత దళాలను ఆపుతున్న దృశ్యాన్ని ప్రదర్శించారు. గల్వాన్‌ ఘర్షణ తర్వాత నుంచి చైనా ప్రచార విభాగం ఈ చిత్రాన్ని విపరీతంగా అక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లింది.

పీఎల్‌ఏ కమాండర్‌ క్వీ ఫాబోవా కూడా సీపీసీ జాతీయ మహాసభకు హాజరయ్యాడు. ఈ మహాసభకు పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నుంచి ఎంపిక చేసిన 304 మంది ప్రతినిధుల్లో క్వీ ఫాబోవా కూడా ఒకడు. గతంలో బీజింగ్‌ వింటర్ ఒలింపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా క్వీ ఫాబోవాను చైనా ఎంపిక చేసింది. ఇందుకు నిరసనగా ఆ క్రీడల ప్రారంభ, ముగింపు వేడుకల్లో చైనాలోని భారత రాయబారి పాల్గొనలేదు. ఈ వేడుకలను దూరదర్శన్‌ కూడా ప్రసారం చేయలేదు. అప్పట్లో అమెరికా సైతం చైనా చర్య సిగ్గు చేటు అంటూ విమర్శించింది. మరోవైపు యుద్ధంలో పాల్గొని విజయం సాధించడానికి చైనా బలగాలకు శిక్షణ తీవ్రతరం చేయనున్నట్లు షీ జిన్‌పింగ్‌ ప్రకటించారు. ఐతే ఏ దేశం పేరునూ ఆయన ఇందులో పేర్కొనలేదు.

2020 జూన్‌లో గల్వాన్‌ వద్ద భారత్‌-చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించారు. చైనా వైపు కేవలం నలుగురు మాత్రమే మరణించినట్లు పీఎల్‌ఏ అధికారికంగా ప్రకటించింది. కానీ, దాదాపు 40 మంది వరకు చైనా సైనికులు మరణించినట్లు రష్యా సహా పలు దేశాల వార్తాసంస్థలు, నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చాయి. 1967 తర్వాత భారత్‌-చైనా మధ్య జరిగిన అతిపెద్ద ఘర్షణ ఇదే. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య పలు విడతల చర్చలు జరిగి ఐదు వివాదాస్పద ప్రదేశాల్లో దళాల ఉపసంహరణకు అంగీకరించాయి.

కాగా ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియోను చైనా గతేడాది ఫిబ్రవరిలో విడుదల చేసింది. తొలుత భారత సైనికులే చొరబడినట్లు, తమ సైన్యం వారిని నిలువరించినట్లు చూపించే ప్రయత్నం చేసింది. రాత్రివేళ ఇరు సైన్యాలు ఫ్లాష్​లైట్ల వెలుతురులో కేకలు వేసుకుంటున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆ వీడియో చూడాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.