MLC Kavitha visits Kondagattu Anjanna Temple : ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే.. ఆంజనేయుని పారాయణానికి మించిన మందులేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో జరిగిన హనుమాన్ చాలీసా పారాయణంలో కవిత పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు అంజన్న ఆలయంలో ఉన్న బేతాళ స్వామిని ఆమె దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా జీవితాన్ని ప్రసాదించేటటువంటి, ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి ఆంజనేయుడిని కొలిస్తే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని మనందరం బలంగా నమ్ముతామని కవిత పేర్కొన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఏ కూడలిలో చూసినా ఆంజనేయుని ఆలయం ఉంటుందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలని అనుకుంటున్న తరుణంలో ఈ దేవాలయంలో దాసానుదాసుడుగా ఉన్న జితేంద్ర రాయ్ ఆంజనేయ పారాయణానికి మించిన ఔషధం లేదని చెప్పారు. అప్పుడు కొండగట్టు అంజన్న సేవా సమితి అనే పేరుతో ఆనాటి నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాలు, పారాయణం దిగ్విజయంగా చేస్తున్నామని కవిత తెలిపారు.