MLA Rajaiah visits Raghavapur : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవపూర్ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు చుక్కెదురైంది. రాజయ్య సభలో మాట్లాడుతుండగా 'నువ్వు మా ఊరికి ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశావు, మళ్లీ ఎందుకు వచ్చావు' అని గ్రామస్థులు నిలదీశారు. రాజయ్యను నిలదీస్తూ సభావేదిక వద్దకు గ్రామస్థులు దూసుకెళ్లగా అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రామస్థులను సభకు వద్దకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు గ్రామస్థులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు.. గ్రామస్థులను పోలీసులు సభ నుంచి దూరంగా తరలించారు. సభ అనంతరం రాజయ్య వెళుతుండగా ప్రజలు ఆయన వాహనానికి అడ్డంగా వచ్చి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేసేదేం లేక ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.