KTR on Agriculture Sector :ఆహారాన్ని నిల్వచేసి వృథాను అరికట్టడంతో పాటు వ్యాక్సిన్లను భద్రపర్చేందుకు శీతల కేంద్రాలు ఎంతో తోడ్పాటందిస్తాయని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో జీఎంఆర్ ఇన్నోవెక్స్ సెంటర్లో తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్ చైన్ సెంటర్ను కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ ఆఫ్ భిర్మింఘం సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పరిశోధనపరంగా భిర్మింఘం యూనివర్సిటీ తోడ్పాటు అందిందనుంది. లాబరేటరీ, కమ్యూనిటీ కూలింగ్ హౌస్ వంటి వాటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
KTR on Cold Chain Center at Shamshabad : దేశం, రాష్ట్రంలో కూలింగ్ వ్యవస్థ బాగుపడాలనేదే ఈ కేంద్రం ఏర్పాటు ఉద్దేశమన్న మంత్రి కేటీఆర్... ఈ తరహా కూలింగ్ సొల్యూషన్స్ దేశవ్యాప్తంగా మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో దేనిని ఆపగలిగినా వ్యవసాయ రంగాన్ని మాత్రం ఆపలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారని కేటిఆర్ అన్నారు. 'ఇలాంటి కూలింగ్ సొల్యూషన్స్ మనకు దేశంలో ఇంకా కావాలి. ప్రపంచానికి నేడు హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్లు పంపిణీ చేస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. ఫేస్వన్లో ఈ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. శీతల కేంద్రం ద్వారా ఆహారం నష్టపోకుండా ఉండేట్లు చూసుకోవాలి. 9 ఏళ్లలో వ్యవసాయ రంగ ఉత్పత్తి ఎగుమతులు పెరిగాయి' అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.