Fish Swallowed King Kobra Live Video : ఆకలి తీర్చుకోవడం కోసం చిన్న చిన్న చేపలు, కప్పలను పాములు మింగడం మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఇక్కడ దానికి పూర్తి భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. పామును చేప మింగిన ఈ ఆసక్తికర ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దంతాలపల్లి మండలం లక్ష్మీపురం శివారులోని పాలేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాం వద్ద ఓ భారీ వాలుగ చేప.. ఏకంగా తాచు పామును నోట చిక్కించుకుంది. అలా పామును అమాంతం మింగేందుకు చేప శత విధాలా ప్రయత్నం చేసింది. అదే క్రమంలో చేప నోటి నుంచి విడిపించుకునేందుకు పామూ పోరాడింది. అలా కాసేపు అవి రెండూ నీటిలో మెలికలు తిరుగుతూ బతుకు పోరాటాన్ని కొనసాగించాయి. చివరకు చూస్తుండగానే రెండూ చనిపోయి ఒడ్డుకు చేరాయి. అనంతరం స్థానికులు వాటిని నీటిలోంచి బయటకు తీశారు. చేప పొట్టలోకి వెళ్లి ఊపిరాడక చనిపోయిన పామును బలంగా బయటకు లాగారు. వామ్మో ఇంత పెద్ద పామును చేప మింగిందా అంటూ గ్రామస్థులు విస్మయం వ్యక్తం చేశారు. ఇవి నీటిలో చేసిన పోరాటాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించడంతో పాటు చరవాణిలో బంధించారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది.