Farmer Set Fire to Tractor in Nizamabad : అటవీ భూమిని ఆక్రమించడంతో ఓ రైతు ట్రాక్టర్ను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతు క్షణికావేశంలో సొంత ట్రాక్టరుకు నిప్పంటించాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి తండాకు చెందిన బాదావత్ ధర్మ అనే రైతుకు చాంద్రాయన్పల్లిలో పోడు పట్టా భూమి ఉంది. ఇచ్చిన చోటకాకుండా అటవీ భూమిలో అక్రమంగా ట్రాక్టర్తో చదును చేస్తున్నాడు. పలుమార్లు హెచ్చరించినా వినకుండా దాదాపు అరెకరం అటవీ భూమి ఆక్రమణకు పాల్పడ్డాడు. అదే భూమిని చదును చేస్తున్న క్రమంలో ట్రాక్టర్ను సీజ్ చేసి అటవీ శాఖ కార్యాలయానికి తరలిస్తుండగా దేవీ తండా వద్ద నిందితుడు పలువురితో కలిసి ట్రాక్టర్ అడ్డుకున్నాడు. డీజిల్ పైపు తీసి నిప్పంటించాడు. దేవీ తండాకు చెందిన స్థానికులు గమనించి వెంటనే దగ్గర్లోని పొలానికి తీసుకు వెళ్లి మంటలను ఆర్పివేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ట్రాక్టరుకు నిప్పంటించాడని రైతుపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.