Electric Scooty Fire Accident In Gadwal : ఇంటి ముందు నిలిపిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగి వాహనం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. గద్వాల పట్టణంలోని ఐడీఎస్ఎమ్టీ కాలనీలో నివాసం ఉండే వీరారెడ్డి.. ఏడాది కిందట ఈ ఫ్లూట్ సెవెన్ జీ ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేశాడు. సోమవారం రాత్రి సుమారు 12:30 గంటల ప్రాంతంలో ఇంటి ముందు నిలిపి ఉంచిన బైక్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన వీరారెడ్డి.. హుటాహుటిన బయటకు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అవి అదుపులోకి రాలేదు.
మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధం అయినట్లు యజమాని వీరారెడ్డి తెలిపారు. ఫైర్ ఇంజిన్కు ఫోన్ చేస్తే.. వారు వచ్చి అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు. రాత్రి ఛార్జింగ్ పెట్టి తీసివేసిన తర్వాత 15 నిమిషాల్లోనే స్కూటీ బ్యాటరీ పేలి పూర్తిగా దగ్ధమైందని వివరించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో బ్యాటరీ పేలడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు.