తెలంగాణ

telangana

Dharani problems: రైతుల పాలిట శాపంగా ధరణి సమస్యలు

By

Published : Dec 2, 2021, 4:15 AM IST

చిక్కుముడులు వీడక తిప్పలు పడుతున్నారు. పరిష్కారం లభించక పరేషాన్ అవుతున్నారు. తమ ఆధీనంలోని భూమి కోసమే కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తమకు తెలియకుండానే తమ భూములను ఇతరులకు కట్టబెట్టిన సిబ్బంది తప్పిదాలకు అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా.. కొలిక్కి రావడం లేదు. ధరణిలో భూసమస్యలతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.

Dharani problems:  రైతుల పాలిట శాపంగా ధరణి సమస్యలు
Dharani problems: రైతుల పాలిట శాపంగా ధరణి సమస్యలు

రైతుల పాలిట శాపంగా ధరణి సమస్యలు

నిజామాబాద్ జిల్లాలో ధరణి సమస్యలు రైతుల పాలిట శాపంగా మారాయి. తమకు తెలియకుండానే భూములను ఇతరులకు కట్టబెట్టిన సిబ్బంది తప్పిదాలకు... అన్నదాతలు ముప్పతిప్పలు పడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కొలిక్కి రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి సోమవారం ప్రజావాణికి ధరణి సమస్యలు పోటెత్తుతున్నాయి. సగానికిపైగా దరఖాస్తులు భూసమస్యలపైనే ఉండటంతో కలెక్టర్‌... డివిజన్‌కు ఒక ధరణి ఇంఛార్జిని నియమించి ప్రజావాణికి హాజరయ్యేలా చూస్తున్నారు. దరఖాస్తులు పరిశీలిస్తున్న ఇన్‌ఛార్జ్‌లు పరిష్కారం చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో సిబ్బంది పట్టించుకోకపోవడంతో సమస్య మొదటికి వస్తోంది. ఒకే సమస్యపై పదే పదే కలెక్టర్ వద్దకు రావాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా అమ్మ పేరు మీద కొత్త పట్టా పుస్తకం వచ్చింది. ఒక సారి రైతుబంధు కూడా వచ్చింది. తర్వాత అధికారుల నిర్లక్ష్యం వల్ల వేరే వాళ్ల పేరు చూపిస్తోంది. దానివల్ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. కలెక్టరేట్​లో అడిగితే ఈ ఆప్షన్​ ధరణిలో లేదు. వెబ్​సైట్​లో ఆ ఆప్షన్​ వచ్చేవరకు కొన్ని రోజులు ఆగాలి అంటున్నారు. -దేవరాజ్, రెంజల్, నిజామాబాద్ జిల్లా

రైతులను వేధిస్తున్నాయి..

భూములు ఆన్‌లైన్ చేసే సమయంలో చేసిన తప్పులే ఇప్పటికీ రైతులను వేధిస్తున్నాయి. పేర్లు, ఫొటోలు, సర్వే నంబర్లు, భూవిస్తీర్ణంలో తప్పులు జరిగాయి. కొన్ని భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. కబ్జాలో ఒకరుంటే పాసుపుస్తకం ఇతరుల పేరుతో రావడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. అన్ని సక్రమంగా ఉన్నా కొందరికి రైతుబంధు, రైతుబీమా అందడం లేదు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా భూములను ధరణిలో ఎక్కించడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి ఫిర్యాదుల ఆధారంగా జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తున్నా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ధరణి వెబ్‌సైట్‌లో అవసరమైన ఐచ్ఛికాలు ఇవ్వకపోవడంతో ఏం చేయడానికి లేకుండా పోయింది. సిబ్బంది తప్పిదాలతో తమ పొలంలోనే పరాయివాళ్లమయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరణిలో సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

DHARANI PORTAL: ధరణిలో సాంకేతిక సమస్యలతో రైతుల తీవ్ర ఇబ్బందులు

ABOUT THE AUTHOR

...view details