ETV Bharat / state

DHARANI PORTAL: ధరణిలో సాంకేతిక సమస్యలతో రైతుల తీవ్ర ఇబ్బందులు

author img

By

Published : Nov 30, 2021, 4:27 AM IST

DHARANI PORTAL: ధరణిలో సాంకేతిక సమస్యలతో రైతుల తీవ్ర ఇబ్బందులు
DHARANI PORTAL: ధరణిలో సాంకేతిక సమస్యలతో రైతుల తీవ్ర ఇబ్బందులు

dharani problems: ఒకటికాదు.. రెండుకాదు.... పదిసార్లు ఫిర్యాదు చేసినా జనం ఎదుర్కొంటున్న భూసమస్యలకు ధరణిలో పరిష్కారం దొరకడం లేదు. అధికారులు చెప్పిందల్లా చేస్తూ ఏళ్లు, నెలల తరబడి తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే తప్ప బాధితుల ఆవేదన తీరడం లేదు. సోమవారం జరిగే ప్రజావాణికి హాజరైన జనాల్లో ఎవరిని కదిలించినా, అత్యధిక ఫిర్యాదులు భూసమస్యలే. దస్త్రాల్లో లోసుగులే. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ధరణి.. తమ పాలిట తీరని సమస్యగా మారిందంటున్న బాధితులపై కథనం.

DHARANI PORTAL: ధరణిలో సాంకేతిక సమస్యలతో రైతుల తీవ్ర ఇబ్బందులు

మహబూబ్​నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన చెన్నయ్య 2020లో తన తండ్రిభూమిని ముగ్గురు అన్నదమ్ములతో వారసత్వంగా పట్టా చేయించుకున్నారు. ధరణిలో ఎవరి భూములు వారికి నమోదయ్యాయి. కానీ ఇప్పటికి పాస్ పుస్తకం మాత్రం చేతికందలేదు. దీని కోసం చెన్నయ్య ఇప్పటికీ ఎన్నోసార్లు కలెక్టర్ కార్యాలయం, మండల తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగారు. చెప్పిందల్లా చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసి తన భూమికి పాస్ పుస్తకం లేదు. రైతుబంధు(raithubandhu) రావడం లేదు.

2020లో మా తండ్రి గారి పేరు మీదున్న భూమిని నా పేరు మీద రిజిస్ట్రేషన్​ చేసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటివరకు మాకు పాసు పుస్తకాలు రాలేదు. ఎమ్మార్వోతో పాటు కలెక్టర్​ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. పాసు పుస్తకం వస్తేనే రైతుబంధు వచ్చే పరిస్థితి ఉంది. -చెన్నయ్య, ఇబ్రహీంపల్లి, రాజాపూర్ మండలం

మిగిలిన భూమి పరిస్థితి ఏంటి..

బాలనగర్ మండలం మొదంపల్లి గ్రామానికి చెందిన నడిమింటి మైసయ్య ఎకరం 14 గుంటల భూమికి పాస్ పుస్తకం రావాలి. కాని ఏడు గుంటలకు మాత్రమే ధరణిలో పాస్ పుస్తకం వచ్చింది. ఆ భూమికే రైతు బంధు వస్తోంది. మిగిలిన ఎకరం 7 గుంటల పరిస్థితి ఏమిటని మైసయ్య అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఐదు సార్లు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కావాల్సిన అన్ని దస్త్రాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. మూడేళ్లుగా ఆయన సమస్య పరిష్కారం కాలేదు. గౌస్ పాషాది సైతం అదే దుస్థితి. 2019 వరకూ ఉన్న 3.07 గుంటలకు రైతుబంధు అందింది. ఆ తర్వాతే ఆన్ లైన్ 20 గుంటల భూమి చూపుతోంది.

ఎకరం 14 గుంటల భూమికి పాస్ పుస్తకం రావాలి. కాని ఏడు గుంటలకు మాత్రమే ధరణిలో పాస్ పుస్తకం వచ్చింది. ఆ భూమికే రైతు బంధు వస్తోంది. మిగిలిన ఎకరం 7 గుంటలకు పాస్​పుస్తకం రాలేదు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా. -నడిమింటి మైసయ్య, పెద్దరేవుల

కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు

సిద్ధాయపల్లికి చెందిన వెంకటేశ్ వికలాంగుడై ఉండి కలెక్టరేట్, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. ఆయనకున్నది 9 గుంటల భూమి. దానికి పాస్ బుక్ లేదు. తొలుత ఇస్తానన్న అధికారులు ఆ తర్వాత ముఖం చాటేశారు. అధికారులు మారారు. కాని పాస్ బుక్ మాత్రం చేతికి అందలేదు.

చేతులెత్తేస్తున్న అధికారులు

మహబూబ్​నగర్ జిల్లా కలెక్టరేట్​కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితుల దీనగాథలివి. ఒక్కొక్కరు ఐదారు సార్లు నేరుగా కలెక్టరేట్​లో ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కరించకపోవడం పరిస్థితికి అద్ధం పడుతోంది. ధరణిలో ఐచ్ఛికాలు లేవంటూ అధికారులు సులువుగా చేతులెత్తేస్తున్నారు. బాధితులు మాత్రం న్యాయం కోసం చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మహబూబ్ నగర్ మాత్రమే కాదు.. రాష్ట్రంలో ఏ కలెక్టరేట్ ను కదిలించిన బాధితుల సంఖ్య కోకొల్లలు. ఇప్పటికైనా ధరణి ఐచ్ఛికాల సమస్యలకు పరిష్కారం చూపాలని జనం కోరుతున్నారు.

ఇదీ చదవండి:

Sajjanar: కుటుంబసమేతంగా సజ్జనార్‌ సందడే సందడి.. వీడియో వైరల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.