తెలంగాణ

telangana

CEC: 'కర్ణాటక ఎన్నికలు సజావుగా సాగేలా పూర్తి సహకారం అందిస్తాం'

By

Published : May 1, 2023, 9:51 PM IST

Updated : May 1, 2023, 10:02 PM IST

Election Commission teleconference with CS: కర్ణాటక శాసనసభ ఎన్నికలు సజావుగా సాగేలా సరిహద్దు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో సహకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నెల పదో తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆరు దక్షిణాది రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర ఎన్నికల సంఘం దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించింది.

Karnataka Election
Karnataka Election

Election Commission teleconference with CS: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వ సీఎస్‌లు, డీజీపీలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అధికారులు సచివాలయం నుంచి సమీక్షకు హాజరయ్యారు.

స్వేచ్చగా, నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగేందుకు చేసిన ఏర్పాట్లను సమీక్షించిన ఈసీ.. సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్ తదితరాలను అరికట్టేందుకు చెక్‌పోస్టులు, పెట్రోలింగ్‌ వ్యవస్థను పెంచాలని అధికారులను ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, మొబైల్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. బోగస్‌ ఓటర్ల పరిశీలన చేపట్టాలని అధికారులకు సూచించారు.

Karnataka election campaign: ముఖ్యంగా పోలింగ్‌కు ముందు చివరి 72 గంటల సమయంలో కర్ణాటక సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున గట్టి నిఘా ఉంచాలని కమిషనర్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభుత్వ సీఎస్‌ శాంతి కుమారి.. సరిహద్దుల్లో నగదు, అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర వస్తువుల తరలింపు నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎన్నికల అధికారులకు వివరించారు.

కర్ణాటక ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని.. అక్కడ స్వేచ్చగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటక సరిహద్దు జిల్లాల నుంచి తెలంగాణలోకి వ్యక్తుల రాకపోకలు, సామాగ్రి తరలింపును పర్యవేక్షించేందుకు పోలీస్, ఎక్సైజ్ శాఖల చెక్ పోస్ట్‌లు పెంచుతున్నామని తెలిపారు. కట్టుదిట్టమైన నిఘా ఉంచుతున్నామని ఎన్నికల కమిషనర్లకు సీఎస్‌ వివరించారు.

Karnataka Election 2023 : మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. రాజకీయ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు తమ మేనిఫేస్టోను విడుదల చేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 224 సీట్లకు ఒకే విడతలో మే 10న జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు స్థానిక పార్టీలు సైతం క‌ర్ణాట‌క ఎన్నిక‌లను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్నాయి. ప్ర‌స్తుతమున్న అధికారాన్ని నిల‌బెట్టుకోవాల‌ని క‌మ‌లం పార్టీ చూస్తుండ‌గా.. గ‌తంలో కోల్పోయిన అధికారాన్ని ఈసారి ఎలాగైనా చేజిక్కుంచుకోవాల‌ని కాంగ్రెస్‌, జేడీఎస్​లు ఉవ్విళ్లూరుతున్నాయి.

ఇవీ చదవండి:

'మోదీజీ.. ఈ ఎన్నికలు మీ గురించి కాదు.. కర్ణాటకకు ఏం చేశారో చెప్పండి'

కర్ణాటకలో 'వైఫ్ పాలిటిక్స్'.. భర్తలకు స్టార్​ క్యాంపెయినర్లుగా ప్రచారం.. గెలిపిస్తారా?

Hyderabad Outer Ring Road: 'బంగారు బాతు ఓఆర్​ఆర్​ను కేటీఆర్ 30 ఏళ్లకు అమ్మేశారు'

Last Updated :May 1, 2023, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details