పాల్వంచకు ఆనుకుని ఉన్న లక్ష్మీదేవిపల్లి(ఎస్) పంచాయతీ పరిధిలోని ఒకటో నెంబర్ సర్వేలో ఉన్న అత్యంత విలువైన భూమిపై స్థానికంగా చక్రం తిప్పే కొందరి కన్నుపడింది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న స్థలం కావడం, గజం వేల రూపాయల ధర పలికే అత్యంత విలువైన భూమిని స్వాహా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేదలకు శాశ్వతంగా హక్కు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో.59 ను అడ్డుగా పెట్టుకుని... కోట్ల భూమిని కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారు.
పక్కా ప్రణాళికతో లేని ఇళ్లు ఉన్నట్లు సృష్టించి... రాత్రికి రాత్రే తప్పుడు ఇంటి నెంబర్లు సృష్టించి, విద్యుత్ మీటర్లు సైతం ఏర్పాటు చేసి... క్రమబద్దీరణ పేరిట వశపరుచుకునేందుకు గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మొత్తం ఈ సర్వేలో 7 ఎకరాల భూమిని కాజేసేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. ఈ భూమి విలువ అక్షరాలా.. సుమారు 35 కోట్లు. ఇదే పంచాయతీ పరిధిలోని అదే ఒకటో నెంబర్ సర్వేలో మరో రెండు చోట్ల ప్రభుత్వ భూమిని వశపరుచుకునేందుకు కొందరు యత్నిస్తున్నారు.
ఇదే సర్వే నెంబర్లో పల్లె ప్రకృతి వనం సమీపంలో మరో ఎకరం భూమిని కబ్జా చేసేలా ప్రణాళికలు చేపట్టారు. పార్కు కోసం ప్రభుత్వానికి ఎకరం స్థలం కేటాయిస్తే.. పక్కనే ఉన్న మరో ఎకరం స్థలాన్ని చదును చేసి ఆక్రమించే యత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏకంగా అమ్మకాలు చేపట్టారు. కొందరు ఇంటి జాగా కోసం భూమిని కొనుగోలు చేసి లక్షలకు లక్షలు చెల్లించారు. ఈ రెండు చోట్లా సుమారు 6 కోట్ల రూపాయల విలువైన భూమిని స్వాహా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.