ETV Bharat / state

పోడుభూముల అంశంపై ప్రభుత్వ కార్యాచరణ వేగవంతం.. నేడు కార్యశాల

author img

By

Published : Dec 2, 2022, 7:10 AM IST

Podu Lands Issue in Telangana: పోడు భూముల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. గ్రామసభల నిర్వహణ పూర్తవుతున్న వేళ.. తదుపరి ప్రక్రియ పక్కాగా పూర్తి చేసేలా గిరిజన సంక్షేమ, అటవీశాఖలు దృష్టి సారించాయి. క్షేత్రస్థాయిలో వచ్చిన అంశాలు, అనుభవాలపై చర్చించి, సమీక్షించేందుకు జిల్లాల అధికారులతో.. ఇవాళ కార్యశాల నిర్వహించనున్నారు.

Podu Lands
Podu Lands

పోడు భూముల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం

Podu Lands Issue in Telangana: పోడు భూముల సమస్య పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాగుదార్ల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. వాటి పరిశీలన, సర్వే, పరిష్కారం ప్రక్రియను చేపట్టింది. నిబంధనల ప్రకారం కసరత్తు పూర్తి చేసి అర్హులైన వారికి పట్టాలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రక్రియ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటి పరిశీలన, సర్వే, గ్రామసభల నిర్వహణ తుదిదశకు చేరుకుంది.

కొత్త సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త: దరఖాస్తులు వచ్చిన 28 జిల్లాలకు గాను 22 జిల్లాల్లో గ్రామసభల నిర్వహణ పూర్తయ్యింది. నాలుగు జిల్లాల్లో 95 నుంచి 99 శాతం వరకు గ్రామసభలు నిర్వహించారు. మునుగోడు ఉపఎన్నిక కారణంగా ఒక్క నల్గొండ జిల్లాలోనే గ్రామసభల నిర్వహణ ఆలస్యమైంది. జిల్లాలో ఇంకా 36 గ్రామాల్లో సభలు జరగాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలన, సర్వే సందర్భంగా పలు అంశాలు అధికారుల దృష్టికి వచ్చాయి. పోడు సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. భవిష్యత్‌లో కొత్త సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడుతోంది.

ఈరోజు హైదరాబాద్‌లో కార్యశాల: అధికారులకు క్షేత్రస్థాయిలో ఎదురైన అనుభవాలు, పరిశీలనకు వచ్చిన అంశాలను.. పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం గిరిజన సంక్షేమ, అటవీ శాఖల జిల్లా అధికారులతో.. ఇవాళ హైదరాబాద్‌లో కార్యశాల నిర్వహించనున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరగనున్న వర్క్‌షాప్‌లో ఆయా జిల్లాల అధికారులు పాల్గొననున్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, ఆయా ప్రాంతాల్లోని.. అటవీ అధికారులతో మంగళవారం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాఠోడ్ సమావేశమయ్యారు.

దానికి కొనసాగింపుగా కార్యశాల జరగనుంది. తదుపరి పూర్తి చేయాల్సిన కసరత్తు, విధివిధానాలపై చర్చిస్తారు. పరిష్కార కసరత్తులో భాగంగా కొత్త వివాదాలు రాకుండా సర్కారు జాగ్రత్త పడుతోంది. రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం ఉన్న పరిస్థితుల్లో జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు. తదుపరి కసరత్తు, పట్టాల సిద్ధం, తదితర అంశాలపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేస్తారు.

ఇవీ చదవండి: శ్రీనివాసరావు ఎలా తెలుసు.. అతనితో ఉన్న బంధం ఏమిటి?

సునామీలో కొట్టుకుపోయాడనుకున్నారు.. కానీ 25 ఏళ్ల తర్వాత ఇంటికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.