తెలంగాణ

telangana

పాన్​ ఇండియా చిత్రాల హవా మనదే.. రూ.1000కోట్లు!

By

Published : Mar 7, 2022, 6:46 AM IST

Updated : Mar 7, 2022, 7:15 AM IST

south pan india movies: పాన్‌ ఇండియా చిత్రాలకి కేరాఫ్‌ అడ్రస్​గా మారింది దక్షిణాది చిత్రసీమ. భాషతో సంబంధం లేకుండా దేశం మొత్తం చూసేలా సినిమాలు రూపొందుతున్నాయి. కథానాయకులు ఆ దిశగా పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. దర్శకనిర్మాతలూ తమ చిత్రాల స్థాయిని పాన్‌ ఇండియా మార్కెట్‌ లక్ష్యంగానే తెరకెక్కిస్తున్నారు. రానున్న 4 వారాల్లో మరో మూడు బడా ప్రాజెక్ట్​లు బాక్సాఫీసు ముందుకు రానున్నాయి. ఈ సినిమాల నిర్మాణ వ్యయం సుమారు రూ. వెయ్యి కోట్లు! ఆ చిత్రాల సంగతులను తెలుసుకుందాం...

pan india movies
rrr radheshyam

south pan india movies: 'భాష వేరు.. నేటివిటీ వేరు' అనే మాటలకి కాలం చెల్లిపోయింది. భావం ఒక్కటైనప్పుడు భాషతో పనేముంది అంటున్నాడు నవతరం సినీ ప్రేమికుడు. హృదయాన్ని స్పృశించే కథ ఉంటే నేటివిటీ సమస్యే కాదని చాటుతూ సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నాడు. పాన్‌ ఇండియా చిత్రాలకు ఇంతకుమించిన అనువైన వాతావరణం ఇంకేం కావాలి? అందుకే ఎంచుకున్న కథ అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉందనిపిస్తే చాలు.. దాన్ని పాన్‌ ఇండియా ప్రేక్షకులకి చూపించడమే లక్ష్యంగా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే దక్షిణాది పాన్‌ ఇండియా చిత్రాల సత్తా ఏమిటో ‘పుష్ప’తో మరోసారి చాటి చెప్పినట్టైంది.

'బాహుబలి','కేజీఎఫ్‌' సినిమాలు సాధించిన విజయాలే ఈ ట్రెండ్‌కి స్ఫూర్తిగా నిలిచాయనడంలో సందేహం లేదు. ఇటు మలయాళం నుంచి అటు హిందీ వరకు భాషలన్నిటినీ ఏకం చేశాయి. ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'కె.జి.ఎఫ్‌-2', 'రాధేశ్యామ్‌'... ఈ మూడు నాలుగేళ్లుగా ప్రేక్షకుల్ని ఊరిస్తున్నవే. ఇవి నలభై రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకొస్తుండడం పరిశ్రమవర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఆ రెండూ తెలుగు నుంచే..

prabhas radheshyam movie: 'వందేళ్ల తర్వాత రాజమౌళి వల్ల మనం భారతీయ సినిమాలు చేస్తున్నాం. నా దృష్టిలో మనం పాన్‌ ఇండియా సినిమాలు చేయడం ఇప్పటికే ఆలస్యమైంది' అనేది ప్రభాస్‌ మాట. ఆయన ‘బాహుబలి’ తర్వాత ఎంచుకునే ప్రతీ సినిమా పాన్‌ ఇండియా మార్కెట్‌ని లక్ష్యంగా చేసుకున్నదే కావడం గమనార్హం. అందులో భాగంగానే తెలుగు వారైన రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్‌’ చేశారు. ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించారు. ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా రూ.300 కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందింది.

'రాధేశ్యామ్​'

ntr ramcharan RRR movie: 'బాహుబలి' చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మరో పాన్‌ ఇండియా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఈ నెల 25నే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించారు. ఈ చిత్ర నిర్మాణ వ్యయం రూ.500 కోట్లు చేరి ఉంటుందనేది పరిశ్రమ వర్గాల లెక్క. ఓ కల్పిత కథతో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ పాత్రలతో రాజమౌళి ఈ సినిమాని రూపొందించారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఈ సినిమాతో పాన్‌ ఇండియా మార్కెట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 'రాధేశ్యామ్‌', 'ఆర్‌ఆర్‌ఆర్‌'... ఈ రెండూ తెలుగు పరిశ్రమ నుంచి రూపొందినవే.

'ఆర్​ఆర్​ఆర్​'

రాకీభాయ్‌ రెండో ఛాప్టర్‌...

Yash kgf 2: కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి పాన్‌ ఇండియా మార్కెట్‌లో జెండా ఎగరేసిన మరో చిత్రం 'కె.జి.ఎఫ్‌'. ఆ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన సినిమానే 'కె.జి.ఎఫ్‌ ఛాప్టర్‌2'. యశ్‌ కథానాయకుడిగా నటించగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం రూ.100 కోట్ల పైమాటే. ఈ సినిమా మూడేళ్లుగా ప్రేక్షకుల్ని ఊరిస్తోంది. వీటి తర్వాత విడుదల కానున్న 'ఆచార్య', 'బీస్ట్‌', 'సర్కారు వారి పాట', 'మేజర్‌' తదితర చిత్రాలపైనా పలు భాషల్లో ఆసక్తి కనిపిస్తోంది.

'కేజీఎఫ్​ 2'

ఇదీ చదవండి: ఎన్టీఆర్​ వీరాభిమాని.. 'ఆర్​ఆర్​ఆర్'​ కోసం థియేటర్​ బుక్​

Last Updated :Mar 7, 2022, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details