తెలంగాణ

telangana

'రూపాయి విలువ పడిపోతుంటే.. రేషన్​ దుకాణాల్లో ప్రధాని ఫొటో కోసం వెతుకుతున్నారు'

By

Published : Sep 23, 2022, 12:56 PM IST

Ktr
Ktr

Ktr Tweet Today: మంత్రి కేటీఆర్​ మరోసారి కేంద్ర ప్రభుత్వ తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రూపాయి విలువ చరిత్రలో అతి తక్కువకు పడిపోయిందని.. అయినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్‌ దుకాణాల్లో ప్రధాని ఫొటో కోసం వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు రాష్ట్రానికి గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షన్​లో వచ్చిన ర్యాంక్‌, రైతుబీమా పథకంపైనా కేటీఆర్​ ట్విటర్​ వేదికగా స్పందించారు.

Ktr Tweet Today: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలో అత్యంత కనిష్ఠానికి పడిపోవడంపై కేటీఆర్ ట్విటర్​లో విమర్శలు గుప్పించారు. ఒకవైపు రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనం అవుతుంటే.. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్‌ దుకాణాల్లో ప్రధాని ఫొటో కోసం వెతుకుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పైగా రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని కేంద్ర మంత్రి అంటున్నారన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం.. ఇలా అన్ని అర్థిక అవరోధాలకు ‘యాక్ట్స్‌ ఆఫ్‌ గాడ్‌’ కారణమని.. విశ్వగురువును పొగడండి అంటూ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు.

రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనమైతే.. జుమ్లాలు మాత్రం ఎన్నడూ లేనంతగా వృద్ధి చెందాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రపంచ మార్కెట్లు, ఫెడ్ రేట్ల కారణంగా రూపాయి విలువ పడిపోయిందని జ్ఞానాన్ని బోధిస్తున్న భక్తుల వాదనతో విశ్వగురు మోదీ అంగీకరించబోరని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అవినీతి చర్యల కారణంగానే రూపాయి విలువ పతనమైందని.. ఐసీయూలో ఉందంటూ గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ప్రస్తావించారు.

టాప్ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది..కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షన్‌ ర్యాంకుల్లో తెలంగాణకు మొదటి ర్యాంక్‌ రావడంపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. రాష్ట్రానికి టాప్‌ ర్యాంక్‌ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా మీ పనిని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. రాజకీయంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తమ ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు వెళుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది..దేశంలోనే రైతులకు భరోసా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైతు బీమా పథకం ద్వారా ఈ ఏడాది 34 లక్షల మంది రైతులకు రూ. 1450 కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి ట్విటర్‌ ద్వారా తెలిపారు. 85 లక్షల మంది రైతులకు రూ. 5 లక్షల చొప్పున పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ట్విటర్​లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details