తెలంగాణ

telangana

కారులో మంటలు.. ఆస్పత్రికి వెళ్తూ 8నెలల గర్భిణీ, ఆమె భర్త మృతి

By

Published : Feb 2, 2023, 4:56 PM IST

Updated : Feb 2, 2023, 5:13 PM IST

కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ఎనిమిది నెలల గర్భిణీ సహా ఆమె భర్త సజీవదహనమయ్యారు. ఈ విషాద ఘటన కేరళలో జరిగింది. మరవైపు, గూగుల్​​ మ్యాప్స్​లో రోడ్డు వెతుక్కునే ప్రయత్నంలో బైక్​పై వెనుక కూర్చున్న ఓ యువతి.. లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలో జరిగిందీ ఘటన.

Two including a pregnant woman charred to death after car caught fire
Two including a pregnant woman charred to death after car caught fire

కేరళలోని కన్నూరు జిల్లాలో విషాదం నెలకొంది. కారులో ఒక్కసారి మంటలు చెలరేగడం వల్ల ఎనిమిది నెలల గర్భిణీతోపాటు ఆమె భర్త సజీవ దహనమయ్యారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులను ప్రిజిత్, అతడి భార్య రీషాగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని కుత్తియాత్తూరుకు చెందిన ప్రిజిత్​ భార్య రీషా ఎనిమిది నెలల గర్భిణీ. ఆమెకు గురువారం తెల్లవారుజామున పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆమెను తీసుకుని కుటుంబసభ్యులు కారులో ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెనుక సీటులో కూర్చున్న నలుగురు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.

మంటల్లో దగ్దమైన కారు

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను ఆర్పి.. ప్రిజిత్​, రీషాను బయటకు తీశారు. కానీ అప్పటికే వారిద్దరూ మృతి చెందారు. శవపరీక్షల నిమిత్తం వారి మృతదేహాలను పోలీసులు.. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిపుణుల సహాయంతో కారును పక్కాగా పరిశీలిస్తామని.. అప్పుడే ఘటనకు గల అసలు కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనంతా స్థానికంగా ఉన్న సీసీటీవీల్లో రికార్డైనట్లు చెప్పారు.

గూగుల్ మ్యాప్స్​లో రోడ్డు వెతుక్కుంటూ..
మహారాష్ట్రలోని పుణెలో దారుణం జరిగింది. గూగుల్​​ మ్యాప్స్​లో రోడ్డు వెతుక్కునే ప్రయత్నంలో బైక్​పై వెనుక కూర్చున్న ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని రిదా ఇంతియాజ్​గా పోలీసులు గుర్తించారు. ముంబయి-బెంగళూరు హైవేపై జనవరి 28న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఖరాడీ ప్రాంతంలో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న నటరాజ్​, రిదా అనే ఇద్దరు ఇంజినీర్లు బైక్​రైడ్​కు వెళ్లారు. ఆ సమయంలో వాన్​వాడి ప్రాంతానికి వెళ్లాలనుకుని గూగుల్​ మ్యాప్స్​ సహాయం తీసుకున్నారు. అలా ముంబయి- బెంగళూరు హైవే మీదకు వచ్చారు. ఆ సమయంలో తాము దారి తప్పినట్లు నటరాజ్​ గ్రహించాడు.

వెంటనే మలుపు తీసుకుంటుండగా.. వేగంగా వచ్చిన లారీ నటరాజ్​ బైక్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రిదా తలకు బలమైన గాయం కావడం వల్ల అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ప్రమాదం జరిగిన తర్వాత లారీని ఆపకుండా.. డ్రైవర్ వెళ్లిపోయాడు. ఘటన అనంతరం నటరాజ్​.. స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్​ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Last Updated :Feb 2, 2023, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details