తెలంగాణ

telangana

'దేశం అమ్ముడుపోకుండా ఆపాలి.. ప్రజలను కాపాడాలి'

By

Published : Sep 5, 2021, 4:34 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​లో ఏర్పాటు చేసిన కిసాన్​ మహాపంచాయత్​కు (Kisan Mahapanchayat) వేల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. సాగు చట్టాలకు నిరసనగా చేపట్టిన ఈ కార్యక్రమంలో 300 రైతుల సంఘాలు పాల్గొన్నాయి. దేశానికి రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ సభను ఏర్పాటు చేసినట్టు రైతు నేత రాకేశ్​ టికాయిత్​ పేర్కొన్నారు.

kisan  Mahapanchayat
కిసాన్​ మహాపంచాయత్​

దేశాన్ని అమ్ముడుపోకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్. రైతులను, యువతను, వ్యాపారాన్ని, ఉద్యోగులను, దేశాన్ని కాపాడుకోవాలన్నారు. వారికి రక్షణ కల్పించడమే ఈ మహా పంచాయత్​ ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం 90 ఏళ్లు పోరాటం జరిగిందని.. అదే విధంగా ఇప్పుడు తమ డిమాండ్లు నెరవేరేందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేమన్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​ జిల్లాలో ఏర్పాటు చేసిన కిసాన్ మహాపంచాయత్ (Kisan Mahapanchayat)​లో ఆయన పాల్గొన్నారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని మరోసారి స్పష్టం చేశారు రైతు నేత రాకేశ్​ టికాయిత్​. ప్రభుత్వం స్వాగతిస్తే చర్చలకు తాము సిద్ధం అని స్పష్టం చేశారు.

కిసాన్​ మహాపంచాయత్​

15 రాష్ట్రాల నుంచి..

సంయుక్త కిసాన్​ మోర్చా ఆధ్వర్యంలో ముజఫర్​నగర్​లోని స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలో ఈ సభను నిర్వహించారు. వివిధ రంగుల టోపీలు ధరించిన రైతులు.. కార్లు, బస్సులు, ట్రాక్టర్లలో సభాప్రాంగణానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్​ప్రదేశ్, హరియాణా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక సహా మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 300 రైతు సంఘాలు పాల్గొన్నాయని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.

'కిసాన్ మహాపంచాయత్'లో పాల్గొన్న రైతులు
కిసాన్ మహాపంచాయత్

వ్యవసాయ చట్టాలపై నిరసన మొదలైనప్పటి నుంచి ఇదే అతిపెద్ద సభ అని రైతు సంఘాలు పేర్కొన్నాయి.

భద్రత కట్టుదిట్టం..

మహా పంచాయత్​ నేపథ్యంలో స్థానికంగా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

మహా పంచాయత్​ సభా ప్రాంగణంపై హెలికాప్టర్​ ద్వారా పూలవర్షం కురిపించాలన్న ఆర్​ఎల్​డీ విజ్ఞప్తిని అధికారులు తిరస్కరించారు. భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రతిపక్షాల మద్దతు..

మహా పంచాయత్​కు కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ వాద్రా మద్దతు తెలిపారు. వ్యవసాయాన్ని కాపాడేందుకు వారు చేస్తున్న పోరాటానికి దేశమంతా మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆర్​జేడీ, ఎస్​పీలు కూడా రైతులకు మద్దతు తెలిపాయి.

ఇదీ చూడండి :మోదీ పాలనకు పట్టం- ప్రపంచ స్థాయిలో టాప్ ర్యాంక్

ABOUT THE AUTHOR

...view details