తెలంగాణ

telangana

బాలికపై అత్యాచారయత్నం.. కిరోసిన్​ పోసి నిప్పు.. 12 రోజులు మృత్యువుతో పోరాడి..

By

Published : Sep 19, 2022, 1:13 PM IST

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారయత్నం చేసి.. కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో బాధితురాలు మరణించింది. ఈ విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు తమిళనాడులో ఓ మహిళా ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది.

teenager burnt
అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసి.. అందుకు నిరాకరించిన ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో బాధితురాలు మరణించింది. 12 రోజులపాటు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం బాధితురాలి గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఈ నెల 7న బాధితురాలిపై అత్యాచారయత్నం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీలీభీత్ జిల్లాలో మాధోతండా పోలీస్​ స్టేషన్​ పరిధిలో 17 ఏళ్ల బాలిక నివాసం ఉంటోంది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన రాజ్​వీర్​ అనే యువకుడు బాలికపై అత్యాచార యత్నం చేశాడు. అందుకు బాలిక ప్రతిఘటించడం వల్ల ఆమెపై కిరోసిన్​ పోసి నిప్పంటించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్చారు.

బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ఈ నెల 11న ఆమెను లఖ్​నవూలోకి ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో సంచలనమైంది. ఇందులో ఇద్దరు నిందితులు తనపై దాడి చేసినట్లుగా బాలిక ఆరోపించింది. ఈ వీడియో వైరల్​ కావడం వల్ల జిల్లా ఎస్​పీ, ఏఎస్​పీ స్పందించారు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి.. జైలుకు పంపారు.

హీలియం గ్యాస్ పీల్చి..
తమిళనాడు ఈరోడ్​లో దారుణం జరిగింది. 25 ఏళ్ల మహిళా ఇంజనీర్ హీలియం వాయువును పీల్చి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఇటీవలే వివాహం జరిగింది. తన భర్తతో కలిసి చెన్నైలో నివాసం ఉంటోంది. గోబిచెట్టిపాళయం గ్రామంలోని తన పుట్టింటికి శుక్రవారం వచ్చింది బాధితురాలు.

కాసేపు విశ్రాంతి తీసుకుంటానని.. తనను ఎవరూ ఇబ్బంది పెట్టొదని కుటుంబ సభ్యులకు చెప్పి గదిలోకి వెళ్లి తాళం వేసుకుంది. కొన్ని గంటలపాటు తలుపు తీయకపోవడం వల్ల కుటుంబ సభ్యులు గది తాళం పగలగొట్టి చూడగా.. మంచంపై బాధితురాలు అచేతన స్థితిలో పడి ఉంది. ఆమె ముఖం, మెడ భాగం వరకు పాలిథీన్ బ్యాగ్‌తో గట్టిగా చుట్టి ఉంది. బెడ్‌కు దగ్గరగా మొబైల్ హీలియం గ్యాస్ సిలిండర్ కనిపించింది. ఆమె మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపిన పోలీసులు.. హీలియం వాయువు పీల్చడం వల్ల ఊపిరాడక మృతి చెందిందని తెలిపారు.

ఇవీ చదవండి:అమ్మాయిల ప్రైవేట్ వీడియోల లీక్ కేసులో ఇద్దరు అరెస్ట్.. ఆందోళనలు విరమించిన విద్యార్థులు

కుక్కపై డాక్టర్​ పైశాచికం.. తాడుతో కారుకు కట్టేసి, రోడ్డుపై ఈడ్చుకెళ్లి...

ABOUT THE AUTHOR

...view details