తెలంగాణ

telangana

మరో వ్యక్తికి పశువుల ఇంజెక్షన్​.. నకిలీ వైద్యుడి కోసం వేట!

By

Published : Apr 20, 2022, 4:45 PM IST

Odisha Fake Doctor: వెన్నునొప్పితో బాధపడుతున్న మరో వ్యక్తికి పశువుల ఇంజెక్షన్​ ఇచ్చిన సంఘటన ఒడిశాలోని మయూర్​భంజ్​ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రెండ్రోజుల వ్యవధిలోనే ఇద్దరికి పశువుల ఇంజెక్షన్​ ఇవ్వటంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న నకిలీ వైద్యుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

Odisha Fake Doctor nother
మరో వ్యక్తికి పశువుల ఇంజెక్షన్​

Odisha Fake Doctor: అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఓ నకిలీ వైద్యుడు పశువుల ఇంజెక్షన్లు ఇస్తున్న ఘటనలు ఒడిశాలోని మయూర్​భంజ్​ జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయి. మహులదిహా గ్రామానికి చెందిన శ్రీకంఠం అనే వ్యక్తి వెన్నునొప్పితో బాధపడుతుండగా రెండ్రోజుల క్రితం పశువుల ఇంజెక్షన్​ ఇచ్చాడు బిశ్వనాథ్​ బెహరా అనే నకిలీ వైద్యుడు. ఇప్పుడు అదే వైద్యుడు మరో వ్యక్తికి సైతం పశువుల ఇంజెక్షన్​ ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడు బిశ్వనాథ్​ బెహరా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

ఇదీ జరిగింది: తకుర్ముందా బ్లాక్​ పరిధిలోని గౌడియాబహలి గ్రామానికి చెందిన బాధితుడు దైతారీ మొహంత(75) కొంత కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. తన నొప్పిని తగ్గించుకునేందుకు వైద్యుడిగా చలామణి అవుతున్న బిశ్వనాథ్​ బెహెరాను కలిశాడు. దీంతో అతడు పశువులకు ఇచ్చే ఇంజెక్షన్లు ఒకేసారి మూడు ఇచ్చాడు.

బాధితుడు దైతారీ మొహంత

గత శనివారం బిశ్వనాథ్​ తమ ఇంటికి వచ్చాడని, వ్యాధిని నయం చేసే మందులను భువనేశ్వర్​ నుంచి తీసుకొచ్చానని చెప్పాడని బాధితుడు దైతారీ తెలిపాడు. ఒక ఇంజెక్షన్​ ఖరీదు రూ.500 అని డబ్బులు తీసుకున్నట్లు చెప్పాడు. వెన్నునొప్పి తీవ్రంగా బాధిస్తుండటం వల్ల నకిలీ వైద్యుడి మాటలు నమ్మి ఇంజెక్షన్​ తీసుకునేందుకు ఒప్పుకున్నాడు దైతారీ. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

బాధితుల ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడు బిశ్వనాథ్​పై హత్యాయత్నం సహా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు మొహుల్దిహా పోలీస్​ స్టేషన్​ ఇన్​స్పెక్టర్​ రంజుహాసిని కులూ. ఇంజెక్షన్​ తీసుకున్న తర్వాత బాధితులు తీవ్ర అస్వస్థతకు గురికావటం వల్ల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. వారు జ్వరం, డయేరియా వంటి లక్షణాలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అయితే.. నిందితుడి పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు రంజుహాసిని కులూ.

ఇదీ చూడండి:నకిలీ వైద్యుడి నిర్వాకం.. వెన్నునొప్పితో బాధపడే వ్యక్తికి పశువుల ఇంజెక్షన్​

ABOUT THE AUTHOR

...view details