తెలంగాణ

telangana

13న పెళ్లి.. 15న మృతి.. బావిలో శవంగా తేలిన నవ వధువు.. పరారీలో భర్త

By

Published : Feb 15, 2023, 8:29 PM IST

Updated : Feb 18, 2023, 12:06 PM IST

బిహార్​లో దారుణం జరిగింది. పెళైన రెండు రోజులకే మహిళ బావిలో విగతజీవిగా కనిపించింది. భర్త, అత్తింటివారే ఈ దారుణానికి పాల్పడ్డారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Newly Married Woman murdered
కొత్తగా పెళ్లయిన మహిళ హత్య

కొత్తగా పెళ్లి చేసుకుని.. కోటి ఆశలతో అత్తారింటికి వెళ్లిన ఓ నవ వధువు ఆశలు.. కాళ్ల పారాణి ఆరకముందే ఆవిరయ్యాయి. పెళ్లైన రెండు రోజులకే ఓ మహిళ బావిలో విగతజీవిగా కనిపించింది. భర్త, అత్తమామలే కలిసే హత్యకు పాల్పడ్డారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ అమానవీయ ఘటన బిహార్​లో జరిగింది. మృతదేహాన్ని బావిలో పడేసిన అనంతరం భర్త సహా అత్తమామలు అక్కడి నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జాముయీ జిల్లాలోని మౌరా గ్రామంలో ఓ బావిలో.. మహిళ మృతదేహాన్ని గుర్తించారు గ్రామస్థులు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలిని సల్మా ఖాతూన్​గా గుర్తించారు.

సల్మా.. రెండు రోజుల క్రితమే ఖాతూన్​ గ్రామానికి చెందిన అన్సారీ కుమారుడు సనాల్ అన్సారీ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఫిబ్రవరి 13న కోర్టులో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు చెప్పారు. సనాల్ అన్సారీకి లక్ష రూపాయలను కట్నంగా కూడా ఇచ్చామని వెల్లడించారు. భర్త, అత్తింటివారే ఆమెను చంపేశారని.. సల్మా ఖాతూన్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో పెళ్లి చేసుకున్న అనంతరం వివాహ పత్రాల విషయంలో ఇరువురికి గొడవ జరిగిందని తెలిపారు. గురువారం రాత్రి సల్మాను అత్తింటి వారు బాగా కొట్టారని.. అనంతరం గొంతు నులిమి చంపేసి.. బావిలో పడేశారని వారు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శవపరీక్ష నిమ్మిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని.. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామని వెల్లడించారు.

Last Updated :Feb 18, 2023, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details