తెలంగాణ

telangana

'ముందస్తు ప్రణాళికతోనే లఖింపుర్ ఘటన.. కేంద్ర మంత్రిదే కుట్ర'

By

Published : Oct 9, 2021, 3:38 PM IST

Updated : Oct 9, 2021, 4:26 PM IST

ముందస్తు ప్రణాళికలో భాగంగానే లఖింపుర్ ఖేరి ఘటన (Lakhimpur Kheri case) జరిగిందని సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతు సంఘాల నేతలు ఆరోపించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా.. కుట్ర పన్నారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిని, ఆయన కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

lakhimpur kheri news
ముందస్తు ప్రణాళికతోనే లఖింపుర్ ఘటన

ఉత్తర్​ప్రదేశ్ లఖింపుర్​ ఖేరి ఘటన(Lakhimpur Kheri incident).. అన్నదాతలకు వ్యతిరేకంగా చేపట్టిన ముందస్తు ప్రణాళికలో భాగమేనని రైతు నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రాను (Ajay Mishra Teni son) అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

సాగు చట్టాలపై నిరసన చేస్తున్న రైతులకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుట్ర పన్నారని సంయుక్త కిసాన్ మోర్చా (Samyukta Kisan Morcha) నేత యోగేందర్ యాదవ్ ఆరోపణలు చేశారు. అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తప్పించాలని అన్నారు. కేసులో (Lakhimpur Kheri case) నిందితులను కాపాడేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా తమ తదుపరి కార్యాచరణను ప్రకటించారు యోగేందర్ యాదవ్. దసరా సందర్భంగా (అక్టోబర్ 15న) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను దహనం చేస్తామని చెప్పారు. లఖింపుర్ ఘటనకు వ్యతిరేకంగా అక్టోబర్ 18న రైల్ రోకో కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

రైతుల పట్ల ప్రభుత్వం హింసాత్మక ధోరణిని అవలంబిస్తోందని మరో నేత జోగిందర్ సింగ్ ఉగ్రాహన్ అన్నారు. కానీ, తాము హింసా మార్గంలో నడవబోమని స్పష్టం చేశారు.

మరోవైపు, లఖింపుర్​ ఘటనలో భాజపా కార్యకర్తలను చంపినవారిని దోషులుగా చూడొద్దని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. నిరసనకారులపైకి కారు దూసుకెళ్లడం వల్ల.. వారు ప్రతిస్పందించారని చెప్పారు. ఇది వారి చర్యకు.. ప్రతిచర్య మాత్రమేనని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ నిరసన

ఈ ఘటనకు నిరసనగా దిల్లీలో కాంగ్రెస్ యువజన విభాగం కార్యకర్తలు నిరసనకు దిగారు. బ్యారికేడ్లను తోసుకుంటూ ఆందోళన చేయడం వల్ల కాస్త ఉద్రిక్తత తలెత్తింది.

యూత్ కాంగ్రెస్ నిరసన
బ్యారికేడ్ల పైకి ఎక్కుతున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు
.

మరోవైపు, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. తన నిరాహార దీక్ష విరమించారు. రెండు రోజుల నుంచి ఆయన ఈ దీక్ష చేస్తున్నారు. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరైన నేపథ్యంలో దీక్ష విరమించారు.

ఇదీ జరిగింది..

యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో లఖింపుర్​ ఖేరిలో (Lakhimpur Kheri news today) హింస చెలరేగింది. టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులకు, అధికార వర్గాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. నిరసన చేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లడం వల్లే రైతులు మరణించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఈ లింక్​ను క్లిక్ చేయండి.

ఇదీ చదవండి:లఖింపుర్ హింస కేసులో పోలీసుల ముందుకు ఆశిష్​ మిశ్రా

Last Updated :Oct 9, 2021, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details