ETV Bharat / bharat

నిరసనలో హింస- ఇద్దరు రైతులు సహా 8 మంది మృతి!

author img

By

Published : Oct 3, 2021, 8:59 PM IST

Updated : Oct 3, 2021, 10:49 PM IST

Several farmers died
నిరసనలో హింస

20:54 October 03

నిరసనలో హింస- ఇద్దరు రైతులు సహా 8 మంది మృతి!

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్‌ ఖేరీ జిల్లా టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. తమపై మంత్రుల కాన్వాయ్‌ దూసుకెళ్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.  

ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతం ఉద్రిక్తతంగా మారింది. ఆగ్రహంతో రైతులు మూడు వాహనాలను తగలబెట్టారు. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జి చేయటం వల్ల పరిస్థితి మరింత విషమించింది. ఈ ఘర్షణలో మరో నలుగురు చనిపోయారు. మొత్తంగా నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 

లఖింపుర్‌ ఖేరీ జిల్లా బన్​బీర్​లోని ఓ ప్రభుత్వ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఆదివారం పాల్గొనాల్సి ఉంది. వేదిక వద్దకు మంత్రి మిశ్రా అప్పటికే చేరుకోగా.. ఉపముఖ్యమంత్రి ఇంకా రావాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న రైతులు.. టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద మంత్రుల కాన్వాయ్​ను అడ్డుకున్నారు. నల్లజెండాలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.  

'సుప్రీంకోర్టే విచారణ జరపాలి'

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు సంఘాలు.. దేశంలోని అన్ని జిల్లా మెజిస్ట్రేట్​ కార్యాలయాల ఎదుట సోమవారం నిరసన చేపట్టేందుకు పిలుపునిచ్చాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ నిరసన కొనసాగనున్నట్లు వెల్లడించాయి. లఖింపుర్​ ఘటనకు సంబంధించి దర్యాప్తును సుప్రీంకోర్టే విచారణ చేపట్టాలని.. కేంద్ర మంత్రి అజయ్​ కుమార్​ మిశ్రాను వెంటనే పదవిలోంచి తొలగించాలని రైతులు డిమాండ్​ చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు రైతులు మృతిచెందారని పేర్కొన్నారు.    

'నా దగ్గర ఆధారాలు ఉన్నాయ్​'

మంత్రుల కాన్వాయ్​లో తన కుమారుడు ఉన్నాడన్న రైతుల ఆరోపణలను ఖండించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్​ మిశ్రా. తన కుమారుడు సభ జరగాల్సిన ప్రాంతంలో ఉన్నాడని.. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముగ్గురు భాజపా కార్యకర్తలు సహా ఓ కారు డ్రైవర్​ను కూడా కొందరు చంపారని ఆరోపించారు.  

దురదృష్టకరం..

లఖింపుర్​ ఘటన దురదృష్టకరం అని అన్నారు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్​. ఈ ఘటన లోతైన దర్యాప్తు చేపడతామని.. ఘర్షణకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  

టికాయిత్..

ఈ ఘటనపై భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్​ స్పందించారు. ఘటన జరిగిన సమయంలో రైతులు నిరసన విరమించి తిరిగివెళ్తున్నారని.. అదే సమయంలో వారిపై దాడి చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో కొంత మందిపై నుంచి వాహనాలు దూసుకెళ్లాయన్నారు. 

లఖింపుర్​లో​ పర్యటించేందుకు టికాయిత్​ శనివారం పయనమయ్యారు.  

ప్రతిపక్షాల విమర్శలు..  

లఖింపుర్​​ ఘటనను ప్రతిపక్షాలు ఖండించాయి.  

'ఇది అమానవీయ ఘటన. భాజపా వైఖరిని యూపీ ప్రజలు ఇంక ఏ మాత్రం సహించరు'  

-అఖిలేశ్​ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ చీఫ్​

'ఈ అమానవీయ ఘటన జరిగిన తర్వాత కూడా స్పందించకుండా ఉన్నవారు ఇప్పటికే చచ్చిపోయినట్టు లెక్క. ఈ త్యాగాలు వృథా కానివ్వం. కిసాన్​ సత్యాగ్రహ జిందాబాద్'

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత  

లఖింపుర్​లో కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ.. సోమవారం పర్యటించనున్నారు. ​

ఇదీ చూడండి : 'నాతో రన్నింగ్​ రేస్​కు రా'.. సీఎంకు ప్రతిపక్ష నేత సవాల్

Last Updated :Oct 3, 2021, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.