ETV Bharat / bharat

'ఓడిపోతామని తెలిసే ఈసీపై 'ఇండియా' ఆరోపణలు- ఎన్​డీఏకు 400సీట్లు గ్యారెంటీ' - Amit Shah On Jammu And Kashmir

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 5:11 PM IST

Amit Shah Fires On INDIA Alliance : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి కారణాలు వెతుక్కునేందుకే విపక్షాలు ఈసీపై ఆరోపణలు చేస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. విపక్ష పాలిత రాష్ట్రాల్లో కూడా బీజేపీ భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ లోక్​సభ ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి 400సీట్ల దాటుతుందని జోస్యం చెప్పారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా విపక్ష కూటమిపై విమర్శలు గుప్పించారు.

Amit Shah Fires On INDIA Alliance
Amit Shah Fires On INDIA Alliance (IANS)

Amit Shah Fires On INDIA Alliance : ఈ లోక్​సభ ఎన్నికల్లో విపక్ష పాలిత రాష్ట్రాల్లో కూడా బీజేపీ భారీ విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్​డీఏ భారీ మెజారిటీతో గెలుస్తుందని తెలిసి విపక్షాలు ఓటమికి సాకులు వెతుక్కుంటూ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మతం ఆధారంగా ప్రచారం చేయలేదని, ముస్లింల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసిందని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు గురించి ఓటర్లకు చెప్పి, యూసీసీ అమలుపై మాట్లాడడం మత ఆధారిత ప్రచారమైతే బీజేపీ అదే చేసిందని అన్నారు. పోలింగ్ ప్రక్రియపై కాంగ్రెస్ ప్రశ్నలు, రాహుల్ గాంధీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా విపక్షాలపై మండిపడ్డారు.

"ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడల్లా కొన్ని ప్రశ్నలను లేవనెత్తాయి. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగే అవకాశమే లేదు. బీజేపీ ఈ లోక్​సభ ఎన్నికల్లో తప్పకుండా 400సీట్లు దాటుతుంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్​లో కూడా ఎన్​డీఏ ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. పేదల సంక్షేమం, దేశ రక్షణ, ఆర్టికల్ 370 రద్దు, యూసీసీ, మహిళా రిజర్వేషన్, రామ మందిరం వంటి బీజేపీ అజెండాలోని ముఖ్య ఘట్టాలను మోదీ నిజం చేశారు. అందుకే ఆయనపట్ల ప్రజాదరణ పెరిగింది. ముస్లింల రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. పేదింటి మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అధికారంలోకి రావడానికి ప్రజాకర్షక హామీలు గుప్పించిన చరిత్ర కాంగ్రెస్​కు ఉంది. బంగాల్​లో బీజేపీ 24-30 సీట్లు, ఒడిశాలో 16-17 సీట్లు సాధిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్​లో ఎన్​డీఏ కూటమి 17 స్థానాలను కైవసం చేసుకుంటుంది." అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

'మోదీ ప్రభుత్వం సాధించిన విజయం'
జమ్ముకశ్మీర్​లో వేర్పాటువాదులు కూడా అత్యధికంగా ఓటేశారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. జమ్ముకశ్మీర్​లో ప్రశాంతంగా పోలింగ్ ముగియడాన్ని మోదీ ప్రభుత్వం సాధించిన విధానపరమైన విజయంగా అభివర్ణించారు. ఈ ఏడాది సెప్టెంబరులో జమ్ముకశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత జమ్ముకశ్మీర్​కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపారు.

"మేము జమ్ముకశ్మీర్​లో డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేశాం. ఎందుకంటే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాతే రిజర్వేషన్లు ఇవ్వొచ్చు. జమ్ముకశ్మీర్​లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువుకంటే ముందే జమ్ముకశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం. కశ్మీర్ లోయలో ఓటింగ్ పెరిగింది. అక్కడి ప్రజలకు భారత రాజ్యాంగంపై నమ్మకం లేదని కొందరు చెబుతుండేవారు. వేర్పాటువాదులు, పాక్​కు మద్దతుగా మాట్లాడేవారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం. గత పదేళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కశ్మీర్ పాలసీకి దక్కిన విజయం. భవిష్యత్​లో కశ్మీర్ లోయలో బీజేపీ అభ్యర్థిని పోటీలో నిలుపుతాం. పార్టీని బలోపేతం చేస్తున్నాం. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత్​లో భాగమే. పీఓకేను స్వాధీనం చేసుకోవడడమనేది బీజేపీ మ్యానిఫెస్టోలో ఉంది. అంతేకాకుండా పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అందుకు కాంగ్రెస్ కూడా మద్దతుగా ఓటేసింది." అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

ఈసారి అధికారంలోకి వస్తే అవి అమలు పక్కా!
ఎన్​డీఏ మూడోసారి అధికారంలోకి వస్తే భాగస్వామ్య పార్టీలతో చర్చించి వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా యూసీసీని అమలు చేస్తామని అమిత్ షా వ్యాఖ్యానించారు. అలాగే జమిలి ఎన్నికలను కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చులు తగ్గుతాయని అమిత్ షా తెలిపారు.

"రాజ్యాంగ సభ మనకు నిర్ణయించిన మార్గదర్శక సూత్రాలలో యూనిఫాం సివిల్ కోడ్ కూడా ఉంది. కేఎం మున్షీ, బాబు రాజేంద్ర ప్రసాద్, అంబేడ్కర్ వంటి న్యాయ పండితులు లౌకిక దేశంలో మతం ఆధారంగా చట్టాలు ఉండకూడదని చెప్పారు. జనసంఘ్ కాలం నుంచి మా అజెండాలో యూసీసీ ఉంది. ఇటీవల కాలంలో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్​లో యూసీసీ అమల్లోకి వచ్చింది." అని అమిత్ షా ఇంటర్వ్యూలో తెలిపారు.

మరో రెండు మూడేళ్లలో దేశంలో నక్సల్స్ ఖతం!
దేశంలో నక్సల్స్ సమస్య వచ్చే రెండు మూడేళ్లలో తీరిపోతుందని అమిత్ షా తెలిపారు. ఛత్తీస్‌గఢ్​లోని చిన్న ప్రాంతంలో తప్ప యావత్ దేశం నక్సల్స్ నుంచి విముక్తి పొందిందని పేర్కొన్నారు. ఛత్తీస్​గఢ్​లో 5నెలల క్రితం బీజేపీ సర్కార్ అధికారం చేపట్టడం వల్ల నక్సల్స్​పై చర్యలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.

'శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాం'
మణిపుర్​లో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అమిత్ షా తెలిపారు. మైతేయి, కుకీ వర్గాల మధ్య ఉన్న వివాదాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ' మైతేయి, కుకీ వర్గాల మధ్య జరిగిన ఉద్రిక్తతలు జాతుల మధ్య సమస్య, హింసకు సంబంధించిన సమస్య. దీనిని బలవంతంగా పరిష్కరించలేము. కొన్ని సంఘటనల కారణంగా రెండు వర్గాలు విడిపోయాయి.' అని అమిత్ షా వ్యాఖ్యానించారు

84ఏళ్ల ఏజ్​లో 'టాటా' 8th క్లాస్​ పరీక్షలు- విదేశాలకు వెళ్లినప్పుడు అలా జరిగినందుకే! - doctor Prakash Indian Tata Stor

టార్చ్​లైట్, కొవ్వొత్తుల​ కింద చదివి టెన్త్ క్లాస్​లో టాపర్- వెంటనే ఇంటికి ఫ్రీ కరెంట్ కనెక్షన్ - Free Electricity Supply To Girl

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.