తెలంగాణ

telangana

జైలు నుంచి విడుదలైన కేంద్రమంత్రి తనయుడు ఆశిష్‌ మిశ్రా

By

Published : Feb 16, 2022, 12:52 AM IST

Lakhimpur Kheri Case: లఖింపుర్​ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడైన అశిష్​ మిశ్రా జైలు నుంచి విడుదలయ్యారు. నగరం వదిలి వెళ్లే అంశంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని ఆశిష్‌ తరఫు న్యాయవాది చెప్పారు. ఇటీవల మిశ్రాకు అలహాబాద్​ హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది.

ashish mishra
మిశ్రా

Lakhimpur Kheri Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడైన ఆశిష్‌ మిశ్రా జైలు నుంచి విడుదలయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి తనయుడైన ఆశిష్‌కు గురువారం అలహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. విడుదలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే విడుదల చేసినట్టు లఖింపుర్‌ ఖేరి జైలు సూపరింటెండెంట్‌ పీపీ సింగ్‌ తెలిపారు. అయితే, రూ.3లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించిందనీ.. నగరం వదిలి వెళ్లే అంశంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని ఆశిష్‌ తరఫు న్యాయవాది చెప్పారు. లఖింపుర్‌ ఖేరి కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్‌ గత అక్టోబర్‌ మాసంలో అరెస్టయ్యారు. అనంతరం పలుమార్లు బెయిల్‌ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే, ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మొదలైన రోజే భాజపా నేత ఆశిష్‌ మిశ్రా బెయిల్‌ లభించడం గమనార్హం. మరోవైపు, కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా తన కుమారుడి నివాసానికి చేరుకున్నారు.

గతేడాది అక్టోబర్‌ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఆశిష్‌ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందడం సహా అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఆశిష్‌ మిశ్రాను పేర్కొన్న పోలీసులు.. అక్టోబర్‌ 9న ఆయన్ను అరెస్టు చేశారు. అయితే, విచారణలో ఆశిష్‌ మిశ్రా సహకరించలేదని పోలీసులు వెల్లడించారు. అనంతరం పలుమార్లు కస్టడీలోకి తీసుకొని విచారించినట్లు సమాచారం.

ఇదీ చూడండి :రోడ్డు ప్రమాదంలో ఎర్రకోట ఘటన నిందితుడు దీప్ సిద్ధూ మృతి

ABOUT THE AUTHOR

...view details