తెలంగాణ

telangana

ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్ద పేలుడు- రంగంలోకి NIA, NSG- ఆ 'లెటర్' స్వాధీనం!

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 1:38 PM IST

Updated : Dec 27, 2023, 2:08 PM IST

Israel Embassy Delhi Blast : భారత్​లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తునకు దిల్లీ పోలీసులు, ఎన్‌ఐఏ బృందం రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్ రాయబారిని దుర్భాషలాడుతూ రాసిన లేఖను గుర్తించారు.

Israel Embassy Delhi Blast
Israel Embassy Delhi Blast

Israel Embassy Delhi Blast : దిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడుకు సంబంధించి కీలక ఆధారాలను దర్యాప్తు బృందాలు సేకరించాయి. ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్ద NSG డాగ్‌ స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ బృందాలు దర్యాప్తు చేపడుతున్నాయి. NIA అధికారులు ఇజ్రాయెల్ ఎంబసీ వెలుపల విచారణ చేపట్టారు. ఇజ్రాయెల్ రాయబారిని దుర్భాషలాడుతూ రాసిన లేఖను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఇజ్రాయెల్‌కు చెందిన ఇతర సంస్థల వద్ద భద్రతను పెంచారు అధికారులు. అంతకుముందు ఇద్దరు అనుమానితులను సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా అధికారులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంగళవారం సాయంత్రం ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతున్న వేళ ఈ ఘటన జరగడం కలకలం సృష్టించింది.

అప్రమత్తంగా ఉండండి: ఇజ్రాయెల్‌
తమ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన పేలుడు ఘటనను ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి ఉగ్రదాడిగా అనుమానించింది. ఈ ఘటన నేపథ్యంలో భారత్‌లోని తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలంటూ పౌరులకు సూచనలు చేసింది. మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం తగ్గించాలని సలహా ఇచ్చింది.

భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో గతంలోనూ రెండు సార్లు దాడులు జరిగాయి. 2012లో ఎంబసీలోని ఇజ్రాయెల్‌ భద్రతా సిబ్బంది భార్య కారుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఆమె గాయపడ్డారు. 2021లో ఎంబసీ వెలుపల పేలుడు సంభవించింది. నాడు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి.

మంగళవారం ఏం జరిగిందంటే?
దిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పేలుడు శబ్దం వినిపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వెంటనే రంగంలోకి దిగిన దిల్లీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. పేలుడు పదార్థాల జాడ కోసం అన్వేషించారు. గంటల పాటు తనిఖీల అనంతరం పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. రాయబార కార్యాలయానికి వెనక ఉన్న గార్డెన్​లో పేలుడు సంభవించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ ప్రాంతానికి సమీపంలో ఓ లేఖ కనిపించిందని చెప్పారు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

దేశంలో బాంబు పేలుళ్లకు ఐసిస్ కుట్ర- భగ్నం చేసిన ఎన్ఐఏ- 8 మంది ఉగ్ర ఏజెంట్లు అరెస్టు

బెంగళూరులో 48 స్కూళ్లకు బాంబు బెదిరింపులు- పేరెంట్స్​లో ఫుల్​ టెన్షన్- పోలీసులు అలర్ట్

Last Updated :Dec 27, 2023, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details