తెలంగాణ

telangana

త్వరలోనే నూతన సహకార విధానం: అమిత్ షా

By

Published : Sep 25, 2021, 5:15 PM IST

మోదీ ప్రభుత్వం త్వరలో నూతన సహకార విధానాన్ని తీసుకురానుందని కేంద్ర మంత్రి (Union Cooperative Minister) అమిత్ షా వెల్లడించారు. సహకార శాఖ ఏర్పాటుపై (Union Cooperation Ministry) కొందరిలో అపోహలు ఉన్నాయని పేర్కొన్న ఆయన.. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూనే పనిచేస్తామని స్పష్టం చేశారు.

amit shah
అమిత్ షా

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నూతన సహకార విధానాన్ని తీసుకురానుందని కేంద్ర సహకార శాఖ మంత్రి (Union Cooperative Minister) అమిత్ షా (Amit shah news) తెలిపారు. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేయనున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను వచ్చే ఐదేళ్లలో 3 లక్షలకు పెంచనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 65 వేల పీఏసీలు ఉన్నాయని షా (Amit Shah Cooperative Minister) వివరించారు. న్యూదిల్లీలో జరిగిన జాతీయ సహకార సదస్సులో (National Cooperative Conference 2021) మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

"కేంద్ర ప్రభుత్వం ఈ మంత్రిత్వ శాఖను (Union Cooperation Ministry) ఎందుకు ఏర్పాటు చేసిందని కొందరు ఆలోచిస్తున్నారు. సహకార సంఘాలు రాష్ట్ర జాబితాలోని అంశం కదా అని చెబుతున్నారు. దీనికి చట్టబద్ధంగా సమాధానం ఇవ్వొచ్చు. కానీ, ఈ వివాదంలోకి నేను తలదూర్చాలనుకోవడం లేదు. ఎలాంటి ఘర్షణ లేకుండానే కేంద్రం రాష్ట్రాలతో సహకారం కొనసాగిస్తుంది. అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ సహకార ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ రంగాన్ని ఆధునికీకరించి, మరింత బలోపేతం చేసేందుకు సహకార మంత్రిత్వ శాఖను రూపొందించాం."

-అమిత్ షా, కేంద్ర సహకార శాఖ మంత్రి

2000లో అప్పటి వాజ్​పేయీ ప్రభుత్వం తర్వాత.. మోదీ సర్కారే సహకార విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని షా తెలిపారు. సహకార ఉద్యమం దేశానికి ఇప్పుడు అత్యవసరమని అన్నారు. దేశ అభివృద్ధికి సహకార సంఘాలు విశేషంగా తోడ్పాటు అందిస్తున్నాయని చెప్పారు. భారత్ ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.

అయితే, ఈ రంగంలో అనేక సమస్యలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు షా. వీటి గురించి తమ ప్రభుత్వానికి అవగాహన ఉందని తెలిపారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:న్యాయమూర్తుల విశ్వసనీయతపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details