తెలంగాణ

telangana

తెలంగాణలో హిట్​- ఛత్తీస్‌గఢ్‌లో ఫట్​- 'ఎగ్జిట్ పోల్స్‌' నెగ్గాయా?

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 10:47 PM IST

Updated : Dec 3, 2023, 10:58 PM IST

Exit Polls Predictions In Assembly Elections 2023 : ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఫలితాలు వెలువడ్డాయి. అయితే పలు సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్​పోల్స్, వాస్తవ ఫలితాలకు ఉన్న తేడా ఎంత? ఎగ్జిట్​పోల్స్ ఎంతమేర నిజమయ్యాయో ఓ సారి తెలుసుకుందాం.

exit polls predictions in assembly elections 2023
exit polls predictions in assembly elections 2023

Exit Polls Predictions In Assembly Elections 2023 :5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ విజయం సాధించగా, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్​ పోల్స్‌ మాత్రం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడబోతున్నాయని అంచనా వేశాయి. ఇంతకీ ఆ అంచనాలు ఎంతమేరకు నిజమయ్యాయి? రాష్ట్రాల వారీగా ఇప్పుడు చూద్దాం.

బీజేపీ మ్యాజిక్​..
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ మరోసారి అధికారంలోకి వస్తుందని అన్ని సంస్థలూ అంచనా వేశాయి. 90 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీకి గరిష్ఠంగా 48 స్థానాలు వస్తాయని ఆయా సంస్థలు అంచనా వేయగా, కాంగ్రెస్‌కు తక్కువలో తక్కువ 40 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. అయితే ఫలితాల వద్దకు వచ్చేసరికి అంచనాలు తారుమారయ్యాయి. బీజేపీకి 54స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 35స్థానాలకే పరిమితమైంది.

కాంగ్రెస్ గాలి..
తెలంగాణలో ఈ సారి అధికారం కాంగ్రెస్‌దేనని దాదాపు అన్ని సంస్థలూ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు కాంగ్రెస్‌కు కనిష్ఠంగా 48 సీట్లు వస్తాయని అంచనా వేయగా గరిష్ఠంగా 82 సీట్లు వస్తాయని చెప్పాయి. సీట్ల సంఖ్యలో తేడా ఉన్నప్పటికీ అధికారం మాత్రం కాంగ్రెస్‌దేనని చెప్పాయి. దీంతో సర్వే అంచనాలు తెలంగాణలో నిజమయ్యాయి.

బీజేపీ విజయకేతనం
230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్‌లో దాదాపు అన్ని సంస్థలూ బీజేపీ వైపే మొగ్గు చూపాయి. కానీ కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఉండబోతోందని అంచనా వేశాయి. బీజేపీ 163 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయగా కాంగ్రెస్‌ 66 స్థానాల వద్ద నిలిచిపోయింది. ఇండియాటుడే, ఇండియా టీవీ సంస్థల అంచనాలు మాత్రమే ఫలితాలకు దగ్గరగా వచ్చాయి.

'సంప్రదాయం రిపీట్​'
రాజస్థాన్‌లో బీజేపీదే విజయమని సర్వేలు అంచనా వేశాయి. కాంగ్రెస్‌ ఓటమి చవిచూస్తుందని పేర్కొన్నాయి. వాస్తవ ఫలితాలు ఇంచుమించు సర్వే అంచనాలను ప్రతిబింబించాయి. బీజేపీ 115 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌ 70 స్థానాలకు పరిమితమైంది.

గత ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..

  • ఎన్నికల ఫలితాల్లో రాజకీయ పార్టీల అంచనాలు తారుమారవ్వడమనేది ఇదే తొలిసారి కాదు. కొన్నిసార్లు దారుణంగా ఓడిన సందర్భాలూ ఉన్నాయి. 2004 లోక్​సభ ఎన్నికల్లో షైనింగ్ నినాదంతో ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల్లో పోటీచేసింది. అప్పట్లో ఎగ్జిట్​ పోల్స్​ అన్నీ ఎన్డీయే 240-250 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ వాస్తవానికి 187 ఎన్డీయే స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.
  • 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎన్నిస్థానాల్లో గెలుస్తుందనే విషయాన్ని ఏ సంస్థ అంచనా వేయలేకపోయింది. ఆ ఎన్నికల్లో ఎన్డీయేకు 300 స్థానాలో విజయదుందుభి మోగించింది. ఒక్క బీజేపీయే 272 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 44 సీట్లకే పరిమితమైంది.
  • నోట్ల రద్దు తర్వాత 2017లో జరిగిన ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్​ అసెంబ్లీ వస్తుందని సర్వేలు అంచనా వేశాయి. కానీ అందుకు భిన్నంగా బీజేపీ 325 స్థానాల్లో విజయఢంకా మోగించింది.
  • 2015లో బిహార్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి, మహాకూటమికి మధ్య గట్టిపోటీ ఉంటుందని సర్వేలు అంచనా వేశాయి. కానీ ఎన్నికల్లో కూటమికి 178 సీట్లు వచ్చాయి. బీజేపీ ఓటమి పాలైంది.
  • 2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ గెలుస్తుందని సర్వేలు అంచనా వేసినప్పటికీ 70 సీట్లకు 67 స్థానాల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తుందని ఎవరూ ఊహించలేకపోవడం గమనార్హం.

అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు ఓటర్ల జై!- తెలంగాణ, మధ్యప్రదేశ్​లో ఎంత శాతమంటే?

సెమీస్​ విజేత 'బీజేపీ'నే- ఫైనల్​కు రెడీ!- 4రాష్ట్రాల ఎన్నికల ఫలితాలివే

Last Updated :Dec 3, 2023, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details