తెలంగాణ

telangana

వర్షపు నీటిని ఒడిసిపడదాం.. కరవు నుంచి బయటపడదాం - RAIN WATER HARVESTING IN HYDERABAD

By ETV Bharat Telangana Team

Published : Apr 28, 2024, 6:20 PM IST

Rain Water Harvesting : ఏదైనా తీసుకుంటే తిరిగి ఇచ్చేయాలి లేదంటే లావైపోతాం. శ్రీమంతుడు చిత్రంలో ఎంతో ప్రజాదరణ పొందిన డైలాగ్ ఇది. అచ్చం అలాగే భూమి నుంచి నీరు తీసుకుంటున్న మనం, తిరిగి భూమిలోకి పంపకపోతే భూమాతకు లోకువైపోతాం. వినడానికి అతిశయోక్తిగా అనిపిస్తున్నా, ముమ్మాటికి ఇది నిజం. నీటి సంరక్షణ విషయంలో హైదరాబాద్ మహానగరంలో అడుగడుగునా నిర్లక్ష్య ధోరణే కనిపిస్తోంది. నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు నగర వ్యాప్తంగా జలమండలి, జీహెచ్ఎంసీ ఎంపిక చేసిన కాలనీల్లో నిర్మించిన ఇంకుడు గుంతలు, 90 శాతం చెత్తా చెదారంతో నిండిపోయాయి. వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రయోజనం నీరు గారిపోతుంది. ఈనేపథ్యంలో వాన నీటి సంరక్షణకు తక్షణ చర్యలు ఎంతైనా అవసరం.

Methods for Rain Water Harvesting
How to Avoid Water Crisis

How to Avoid Water Crisis : ఆవిరవుతోంది జలం, ఉద్యమించాలి మనం. నీటిని ఆదా చేస్తే క్షేమం, విస్మరిస్తే తప్పదు క్షామం. జలమే జగతికి ప్రాణాధారం, జలమే ప్రగతికి మూలాధారం. బొట్టు బొట్టును దాచిపెట్టు, రాబోయే తరాలకు అమృతమది ఒట్టు. ఇవి నినాదాలు కావు, నిజాలు. నీటి విలువ తెలిసిన ప్రతి పౌరుడు ఆచరించాల్సిన ప్రాథమిక సూత్రాలు. బాధ్యత తెలిసిన ప్రతి వ్యక్తి తూచా తప్పకుండా పాటించాల్సిన పద్దతులు. అప్పుడే మూడు వంతుల నీరున్న ఈ భూభాగంలో, తాగడానికి మంచినీరు కరవవుతోందన్న మాటలు భవిష్యత్​లో వినిపించవు.

కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరంలో నీటి సంరక్షణ చర్యలు నామ మాత్రంగానే ఉన్నాయి. వానా కాలంలో కోట్లాది లీటర్ల నీరు, వృథాగా మురుగు కాలువల్లోకి చేరి అక్కడి నుంచి నదుల్లో కలుస్తుంది. ఎండాకాలంలో చాలా చోట్ల నీటి ఎద్దడి కనిపిస్తోంది. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ప్రజల గొంతు ఎండకుండా ఉండేందుకు జలమండలి సుదూర ప్రాంతాల్లోని రిజర్వాయర్ల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తాగునీటిని సరఫరా చేస్తోంది. అయినా సరే, నీటి ఎద్దడి తప్పడం లేదు.

నీటి సంరక్షణలో నిర్లక్ష్యం.. ఒక దశలో బెంగళూరు, చెన్నై లాంటి సంక్షోభాలు రావచ్చనే ఆందోళన వ్యక్తమైంది. వాటన్నింటిని బేఖాతరు చేస్తున్న నగరవాసులు, ఏ పూటకు ఆ పూటే సరిపెట్టుకుంటున్నారు. రేపటి కోసం ఆలోచించకుండా నీటి సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టుకునేందుకు చేపట్టాల్సిన చర్యలు ఎక్కడా కానరావడం లేదు. నగరంలో దాదాపు 30 శాతం అపార్ట్ మెంట్లు, భవనాల్లో వర్షపు నీటిని సంరక్షించుకునే నిర్మాణలు లేకపోవడం గమనార్హం.

వాల్టా చట్టం ప్రకారం 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించిన అన్ని ప్రాంగణాల్లో వర్షపు నీటిని భూమిలో ఇంకించడానికి ఇంకుడు గుంతలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆ తరువాత ఆ విస్తీర్ణాన్ని300 చదరపు మీటర్లకు సవరించారు. అయినప్పటికి ఇంకుడు గుంతల నిర్మాణంలో అలసత్వం కనిపిస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీ, జలమండలి వేరు వేరుగా నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం వెలుగుచూసింది.

రాష్ట్రమంతా పంటలు ఎండుతున్నా - ఆ ఊర్లో మాత్రం ఎక్కడ చూసినా పచ్చని పొలాలే - కారణం ఏంటంటే? - Crops with spring wells

సాహె స్వచ్చంద సంస్థ చొరవ.. నీటిని తీసుకోవడం హక్కుగా భావించే ప్రజలు, నీటి సంరక్షించడం బాధ్యతగా అలవాటు చేసుకోవాలని ప్రముఖ సాహె స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు కల్పన రమేష్ కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా నీటి సంరక్షణ పద్దతులపై జీహెచ్​ఎంసీ, జలమండలితో కలిసి హైదరాబాద్ మహానగరంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని తన ఇంటిని, తన నివాసం ఉంటున్న రోలింగ్ హిల్స్ కాలనీని ఉదాహారణగా చూపిస్తూ ప్రజలను నీటి సంరక్షణ చేసుకోవడంలో ప్రోత్సహిస్తున్నారు.

అంతేకాకుండా వ్యక్తిగతంగా నగరంలో సర్వే చేయించారు. నగరంలో సుమారు 6 వేలకుపైగా పెద్ద పెద్ద బావులుండేవి. ఒక్కో బావి చుట్టు పక్కల నీటి కరవు రాకుండా చూసేవే. కాలక్రమేణా కాంక్రిట్ జంగిల్​గా మారిన నగరంలో చాలా బావులు కనుమరుగైపోయాయి. ఆ ప్రదేశాల్లో భూగర్భజలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోతున్నట్లు గుర్తించారు. బన్సీలాల్ పేట సహా 25 బావులను పునరుద్దరించారు. దాని వల్ల చుట్టుపక్కల నీటి కొరత అనేదే లేదు. ప్రజలు కాస్తా శ్రమించి ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్​వెల్స్ నిర్మించుకుంటే నీటి ఎద్దడి నుంచి గట్టెక్కవచ్చని కల్పనా రమేష్ చెబుతున్నారు.

Methods for Rain Water Harvesting : నీటి సంరక్షణలో ప్రస్తుతం ఎన్నో కొత్త కొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంటిపై పడిన ప్రతి నీటి బొట్టు వృథాగా పోనివ్వకుండా ఒడిసిపట్టుకోడానికి ఇంకుడు గుంతల నిర్మాణం, సాంకేతికంగా ఇంజెక్షన్ బోర్ వెల్స్, ఉన్న బోరు బావుల్లో మధ్యలో కట్ చేయడం వల్ల సాధ్యమైనంత వరకు వర్షపు నీటిని భూమిలోకి ఇంకించవచ్చు. ఇందుకోసం ఈ ఏడాది పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్ ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేశారు.

ఈ వేసవికి ఢోకా లేదు - భాగ్యనగరవాసులకు ప్రభుత్వం భరోసా - hyderabad Water board

నీటి సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ..బయో డైవర్సిటీ ప్లాంటేషన్, ఉష్ణోగ్రతలను తగ్గించడం, నీటి సంరక్షణ చర్యలు చేపట్టడమే ప్రధాన ఏజెండాగా కార్యచరణ రూపొందించారు. జలమండలి, జీహెచ్ఎంసీ, భూగర్భ జల వనరుల శాఖ, రెవెన్యూ సహా అనుబంధ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ నగరంలో నీటి సంరక్షణ కోసం పాటుపడుతున్నారు. 2050 నాటికి దేశంలో నీటి కొరత పెచ్చురిల్లుతుందని, అప్పటి వరకు నీటి లభ్యతలో 15 శాతం తగ్గుదల ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

Rain Water Harvesting in Hyderabad :అదే సమయంలో జల వనరుల డిమాండ్ 30 శాతం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. డిమాండ్- సరఫరాల మధ్య భారీ వ్యత్యాసం చోటుచేసుకుంటోందని, తద్వారా నీటి ఎద్దడి మరింత తీవ్ర రూపం దాల్చి నీటి కోసం గొడవలకు దిగాల్సి పరిస్థితులు నెలకొంటాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు తరహా నీటి సంక్షోభాలు భవిష్యత్​లో హైదరాబాద్ లాంటి నగరాల్లో తలెత్తకుండా జాగ్రత్త పడాలంటే జలాశయాలు, జల వనరుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు, నిబంధనలు రూపొందించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గృహ నిర్మాణ అనుమతుల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేలా కఠిన నిబంధనలు చేయాలి. వర్షాకాలంలో కురిసే ప్రతి నీటి బొట్టునూ భూమిలోకి ఇంకేలా జాగ్రత్త పడాలి. విస్తృత స్థాయిలో జల సంరక్షణ చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్​లో తలెత్తే నీటి కొరతను అధిగమించడం సాధ్యమవుతుంది. ఇందుకోసం పౌరసమాజం, ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు, స్వచ్చంద సంస్థలు, సామాన్యులు అందురూ సమన్వయంతో కదలాలి. నీటి సంరక్షణ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం తక్షణ అవసరమన్న సంగతిని అన్ని వర్గాలు గుర్తించాలి.

తాగునీటి పర్యవేక్షణకు ఐఏఎస్​లు - ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం - special officers for drinking water

ABOUT THE AUTHOR

...view details